Hyderabad Drugs: చెడు సావాసంతో డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిందన్న చందాన ఆ తరువాత పెడ్లర్ గా మారాడు. డెడ్ డ్రాప్ పద్దతిలో మాదక ద్రవ్యాలు తెప్పించుకుంటూ నైజీరియా నెంబర్ ను వాడుతూ విక్రయాలు మొదలు పెట్టాడు. కొన్నేళ్లుగా ఇలా దందా చేస్తున్న సదరు పెడ్లర్ను ఈగల్ ఫోర్స్ అధికారులు బెంగళూరు ఎన్సీబీ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపూర్ కు చెందిన రాహుల్ 2024లో విక్రమ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత బెంగళూరులోని రామమూర్తినగర్ లోని టొయోటా షోరూంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే అతనికి అర్ష్లన్ తో అలియాస్ అర్ష్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అర్ష్ డ్రగ్స్ కు అలవాటు పడి ఉన్నాడు. అతనితో స్నేహం అయ్యాక రాహుల్ కూడా మాదక ద్రవ్యాలు సేవించటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో నైజీరియా దేశానికి చెందిన జాన్సన్ అలియాస్ హానర్తో అతనికి పరిచయం ఏర్పడింది. చెడు వ్యసనాల కారణంగా చేరిన నాలుగు నెలలకే ఉద్యోగం పోగొట్టుకున్న రాహుల్ డబ్బు సంపాదించటానికి డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇదిలా ఉండగా డ్రగ్స్ దందా చేస్తున్న జాన్సన్ను బెంగళూరు పోలీసులు మూడు నెలల క్రితం అతని స్వదేశానికి పంపించేశారు. అయినా, జాన్సన్ ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ బెంగళూరులో ఉన్న లోకల్ ఏజెంట్ల ద్వారా మాదక ద్రవ్యాల దందా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విషయం తెలిసి రాహుల్ అతన్ని ఫేస్ బుక్ ద్వారా సంప్రదించాడు. జాన్సన్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత గ్రాము ఎండీఎంఏ డ్రగ్ ను 11వందల రూపాయలకు కొంటూ ఇక్కడ 2వేల రూపాయలకు గ్రాము చొప్పున అమ్మటం మొదలు పెట్టాడు. జాన్సన్ పంపించే క్యూఆర్ కోడ్ లకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తూ మాదక ద్రవ్యాలు తెప్పించుకుంటున్నాడు.
Also read: జైపూర్లో విషాదం.. రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి!
ఇక, రాహుల్ నుంచి డబ్బు అందగానే జాన్సన్ బెంగళూరులో ఉంటున్న తన నెట్ వర్క్ లోని వ్యక్తుల ద్వార డెడ్ డ్రాప్ పద్దతిలో రాహుల్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ వస్తున్నాడు. జాన్సన్ గ్యాంగ్ సభ్యులు ఏదో ఒక చోట డ్రగ్ ప్యాకెట్లు పెట్టి ఆ ప్రాంతం లైవ్ లొకేషన్ ను రాహుల్ కు షేర్ చేసేవారు. వెంటనే రాహుల్ అక్కడికి వెళ్లి వాటిని తీసుకునేవాడు. ఆ తరువాత తన కస్టమర్లకు ఇదే పద్దతిలో మాదక ద్రవ్యాలను డెలివరీ చేస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో బాలానగర్ ఎక్సయిజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తరువాత రాహుల్ మరోసారి దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. దీని కోసం నైజీరియా దేశానికి చెందిన మొబైల్ ఫోన్ నెంబర్ ను వాడటం మొదలు పెట్టాడు. కాగా, జైల్లో ఉన్న సమయంలో రాహుల్ తన ఇన్ స్టాగ్రాం ఐడీని మోహిత్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చాడు. మూడు నెలల క్రితం మోహిత్ కుమార్ తనకు 20గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కావాలని అడుగగా బెంగళూరుకు పిలిపించుకున్నాడు. డ్రగ్ ఇచ్చి పంపించాడు. అయితే, హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈగల్ ఫోర్స్ అధికారులు షాద్ నగర్ పోలీసులతో కలిసి మోహిత్ కుమార్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల ఆధారంగా బెంగళూరుకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ ప్రత్యేక బృందం బెంగళూరు ఎన్సీబీ అధికారులతో కలిసి అయిదు రోజులపాటు నిఘా పెట్టి అతన్ని పట్టుకున్నారు.
మొదట 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాహుల్ వెల్లడించిన సమాచారం ఆధారంగా డెడ్ డ్రాప్ పాయింట్ల వద్ద తనిఖీలు జరిపి మరో 108 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు. దర్యాప్తులో రాహుల్ వారంలో కనీసం 5వందల గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను విక్రయిస్తున్నట్టుగా తేలింది. దాంతోపాటు జాన్సన్ కస్టమర్లకు మరో 8వందల గ్రాముల డ్రగ్ ను సప్లయ్ చేస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. రాహుల్ కస్టమర్ల లిస్టులో తెలంగాణకు చెందిన 10మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. గచ్చిబౌలి డ్రగ్ కేసులో నిందితులుగా ఉన్న నీలిమ, విక్రమ్ రెడ్డితోపాటు జ్వాలా పాండేకు ఇతనే డ్రగ్ సరఫరా చేస్తున్నట్టుగా వెల్లడైంది. చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితున్ని అరెస్ట్ చేసిన సీఐ సంతోష్ అతని బృందాన్ని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అభినందించారు.
Also read: ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్బార్.. తక్కువ బడ్జెట్లో ఇల్లే సినిమా థియేటర్!