Jaipur: రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్కు చెందిన భారీ రక్షణ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం జరిగిన సమయంలో గోడకు ఆనుకుని పలువురు కూలీలు పని చేస్తున్నారు. ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో బరువైన కాంక్రీట్ శిథిలాల కింద కార్మికులు నలిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కార్మికులను రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్న పేదలుగా గుర్తించారు.
నిర్మాణంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీగల్ పర్మిషన్లు ఉన్నాయా లేదా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కార్మికులు ఇలా ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి
రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న రిసార్ట్ రక్షణ గోడ కూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకోగా, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. #Jaipur… pic.twitter.com/1yzR7IF1Xd
— BIG TV Breaking News (@bigtvtelugu) June 29, 2026