Bengaluru Crime: కారణాలు ఏమైనా కావచ్చు.. డబ్బుల కోసం డబుల్ మర్డర్ చేశాడు ఓ టెక్కీ. మృతులు ఎవరో తెలుసా? టెక్కీ తల్లిదండ్రులు. టెక్కీ ఎందుకు పేరెంట్స్ని హత్య చేశాడు? దీనివెనుక బలమైన కారణం ఉందా? నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.
బెంగుళూరులో డబుల్ మర్డర్స్ కలకలం.. అడ్డంగా దొరికిపోయిన టెక్కీ
బెంగళూరులో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపుతోంది. తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు కన్నకొడుకు. విజ్ఞాన్ నగర్లోని ఆదర్శ విస్టాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. నేవీలో రిటైర్ కెప్టెన్ నవీన్ చంద్రభట్. ఆయన వయస్సు 60 ఏళ్లు. భార్య డాక్టర్ శ్యామల భట్. ఆమె దంత వైద్యు నిపుణురాలు. వీరికి డబ్బులకు కొదవలేదు.
ఈ దంపతులకు కూతురు-కొడుకు ఉన్నారు. కొడుకు పేరు రోహన్ భట్. అతడి వయస్సు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన రోహన్, అమెరికాలో పని చేసేవాడు. మూడేళ్ల కిందట అమెరికా నుండి బెంగుళూరు తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఏ కంపెనీలో ఉద్యోగం చేయలేదు. మరొక ప్రాంతంలో విడిగా ఉంటున్నాడు.
తల్లిదండ్రులను దారుణంగా చంపిన కొడుకు
సొంతంగా స్టార్టప్ను స్థాపించాలని భావించాడు. ఈ క్రమంలో డబ్బు కోసం తన తల్లిదండ్రులను వేధించేవాడు. రోహన్ ఫ్యామిలీలో ఈ వ్యవహారం తరచుగా గొడవలకు దారి తీసింది. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు రోహన్. డబ్బుల విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
ఆగ్రహంతో ఊగిపోయిన రోహన్, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. వారి కేకలు విన్న ఇరుగుపొరుగువారు నవీన్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో ఇంట్లో నుంచి రక్తపు మరకలున్న దుస్తులతో రోహన్ బయటకు పరిగెత్తడం చూశారు. ఈలోగా అంబులెన్స్కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన దంపతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: మహిళ గొంతు నులిమి.. ఆ తర్వాత బంగారం దోచేశాడు
అప్పటికే నవీన్-శ్యామల దంపతులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు రోహన్పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత అరెస్టు చేశారు. దాడి వెనుక ఖచ్చితమైన ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నారు. రోహన్ తన తండ్రితో తరచూ గొడవ పడేవాడని, ఉద్యోగం లేకపోవడంతో తండ్రి అవమానించేవాడని ఓ అధికారి తెలిపారు.
ఈ కారణంగానే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గురువారం నిందితుడ్ని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతుల కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.