Road Accident: రాజస్థాన్లోని జోధ్పూర్–జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామ్ దేవ్రా ధామానికి దర్శనం కోసం భక్తులతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన టెంపోలో మొత్తం.. 20 మందికి పైగా భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ దేవ్రా దేవాలయం దర్శనం కోసం వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి టెంపోను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు స్పాట్లోనే మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: తిరుమల ఘాట్లో కారు బోల్తా.. స్పాట్లో భక్తులు
ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అతను అతివేగంగా వాహనం నడపడం, నిద్ర మత్తు కారణంగా కానీ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.