Parakamani Case CI: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ మృతి చెందారు. సీఐ సతీష్ కుమార్ మృతదేహాన్ని డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ పరిశీలించారు. తాడిపత్రి నియోజకవర్గం జూటూరు-కోమలి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ పక్కన సీఐ సతీష్ కుమార్ విగతజీవిగా పడి ఉన్నారు. సీఐ సతీష్ కుమార్ ది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. సతీష్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పరకామణి చోరీలో రవికుమార్ను సీఐగా ఉన్నప్పుడు సతీష్ కుమార్ అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ కుదుర్చుకున్నారు. పరకామణి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినప్పటికీ, అప్పట్లో రాజకీయ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో కోర్టులో సతీష్ కుమార్ కేసును రాజీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, కేసును సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం దర్యాప్తు చేస్తోంది.
సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో, కేసును రాజీ చేసుకున్న కీలక వ్యక్తి సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఐ మృతికి గల కారణాలు, ఈ ఘటనకు పరకామణి కేసు దర్యాప్తుతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ సీఐడీ అధికారులు విచారించారు. అనంతరం మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇంతలో ఆయన అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Pune Accident: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
టీటీడీ పరకామణి చోరీ కేసు వెలుగులోకి రావడానికి సీఐ సతీష్ కుమార్ కీలక పాత్ర వహించారు. ఏప్రిల్ 2023లో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో రవికుమార్ నగదు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సతీష్ కుమార్ ఫిర్యాదుతో రవికుమార్ పై కేసు నమోదైంది. దీంతో ఈ కేసులో సతీష్ కుమార్ ప్రధాన సాక్షిగా మారారు. ఆ తర్వాత రవికుమార్ తో టీటీడీ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంది. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ ఎలా చేసుకుంటారని పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ కేసును మళ్లీ విచారించాలని కోర్టు సీఐడీని ఆదేశించింది.