Bypoll Election Results 2025 : దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. వివిధ ప్రాంతాల్లో విభిన్న రాజకీయ ధోరణులు స్పష్టమవుతుండగా, కొన్ని చోట్ల అధికారపక్షాలు కాపాడుకున్నా, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు చెక్ పెట్టాయి. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశాలో జరిగిన ఈ ఉప ఎన్నికలు 2025లో రాజకీయ దిశలు ఎలా ఉండబోతున్నాయో సంకేతాలు ఇస్తున్నాయి.
తెలంగాణలో అత్యంత హాట్సీట్గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ప్రారంభం నుంచే హైటెన్షన్ పరిస్థితుల మధ్య సాగిన ఈ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ బలమైన పోటీని ఇవ్వలేకపోయాయి.
జమ్మూ కాశ్మీర్లో ఈసారి రెండు ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. నగ్రోటాలో బీజేపీ అభ్యర్థి దేవయానీ రానా ఘన విజయం సాధించారు.
బడ్గాంలో మాత్రం పిడిపి తరఫున సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. రెండు ప్రాంతాల్లో పూర్తిగా భిన్న రాజకీయ వాతావరణం ఉండటంతో, జమ్మూ-కాశ్మీర్లో డ్యూయల్ పాలిటికల్ ట్రెండ్ మరింత స్పష్టమవుతోంది.
జార్ఖండ్లో ఘట్షిలా ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సులభ విజయం సాధించారు. ఈ ఫలితం జార్ఖండ్ రాజకీయాల్లో జేఎంఎం ప్రభావం ఇంకా గట్టిగానే కొనసాగుతుందనే సందేశం ఇస్తోంది.
రాజస్థాన్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ అంట ఉప ఎన్నికల్లో విజయపతాక ఎగురవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి నెలలు కావడంతో, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు పార్టీకి మానసిక బలం ఇచ్చిందని రాష్ట్ర నాయకులు అంటున్నారు.
తరణ్ తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సందు విజయంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తమ పట్టు చూపించింది.
మిజోరాం డంప ఉప ఎన్నికలో MNF అభ్యర్థి లాల్ తమంగ్ లినా విజయం సాధించారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొన్న MNF తిరిగి బలం సమకూర్చుకుంది.
ఒడిశాలో నౌపడ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒడిశాలో బీజేపీ మొదటి విజయం ఇదే కావడంతో, ఈ ఫలితం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ ఓటమి.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
ఏడు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు ..ప్రాంతీయ పార్టీలూ బలమైన ప్రభావాన్ని చూపించాయి.