Tirupati Accident: తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణాపురం సమీపంలోని NH-716A జాతీయ రహదారిపై జరిగిన ఒక బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగరాజు, సంజయ్గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న డ్యూక్-200 బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మృతులిద్దరూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon)లో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఒక శుభకార్యానికి హాజరై, తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలో స్నేహితులతో సరదాగా గడిపి, ఇంటికి చేరుకునే లోపే విధి వంచించింది. బైక్ వేగంగా ఉండటం, అంధకారం కారణంగా చెట్టును గమనించకపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, తలకు తీవ్ర గాయాలు కావడమే మరణానికి దారితీసిందని తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాగలాపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఇతర వాహనాల ప్రమేయం ఏమీ లేదని, బైక్ సెల్ఫ్ యాక్సిడెంట్కు గురైందని పోలీసులు స్పష్టం చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: టెక్కీ సూసైడ్ వెనుక.. వెలుగులోకి కొత్త విషయాలు, అదే కారణమా?
తమ చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. యువత అతివేగంగా వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం కూడా మరణానికి ఒక కారణమై ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.