Bhoothpur Tragedy: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెల్కిచర్ల గ్రామంలో గురువారం ఉదయం కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వెల్కిచర్ల గ్రామానికి చెందిన జంగమ్మ (42)అనే మహిళకు తన కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విరక్తి చెందిన ఆమె, గురువారం ఉదయం తన కుమార్తెలు జ్యోతి (15), శైలజ (13),కుమారుడితో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, తన ఇద్దరు కుమార్తెలను బలవంతంగా బావిలోకి నెట్టేసింది. ఆ తర్వాత తాను కూడా బావిలోకి దూకి తనువు చాలించింది.
తల్లి తన అక్కలను బావిలోకి తోసేయడం చూసిన కుమారుడు భయంతో అక్కడి నుండి తప్పించుకున్నాడు. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ బాలుడు పరుగున వెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వెల్కిచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: షాపూర్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు ఇంటర్ విద్యార్థుల బలి