Gun misfire: నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ (GRP) పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా తుపాకీని అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తు అది పేలడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో రైల్వే పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే.. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య, తన డ్యూటీ ముగించుకుని తెల్లవారుజామున ఆయుధాన్ని తిరిగి హ్యాండోవర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో గన్ అన్లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తూటా పేలి ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గన్ ఏ విధంగా మిస్ ఫైర్ అయింది? సాంకేతిక లోపమా లేక అజాగ్రత్త వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆయుధాలను హ్యాండోవర్ చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది.
Also Read: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్మెంట్లో పేలిన ఏసీ.. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు
విధి నిర్వహణలో ఉన్న తోటి ఉద్యోగి ఇలా మరణించడంతో డోన్ పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు పెద్దయ్య నిబద్ధత గల అధికారిగా పేరు తెచ్చుకున్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నంద్యాల జిల్లా డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఘటన
తెల్లవారుజామున గన్ హ్యాండోవర్ చేసే సమయంలో పేలిన గన్
హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి pic.twitter.com/OQ9TI9bfEX
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2026