Odisha Crime: ఒడిశాలో దారుణం జరిగింది. పప్పు మీద పడిందని క్లాస్ మేట్ ను ముగ్గురు విద్యార్థులు హత్య చేశారు. గత వారం భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS)లో 9వ తరగతి విద్యార్థి సిబా మొండా(14) అనుమానాస్పదంగా మరణించాడు. ఈ ఘటనపై బుధవారం సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ బాత్రూంలో జారిపడి విద్యార్థి చనిపోయాడని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు చెప్పారు. అయితే మద్యం మత్తులో ముగ్గురు క్లాస్మేట్స్.. విద్యార్థిని హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
కియోంఝర్లోని టికార్గుమురా గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి సిబా ముండా డిసెంబర్ 12న భువనేశ్వర్ కిమ్స్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆసుపత్రిలో మరణించాడు. రెసిడెన్షియల్ స్కూల్ అధికారులు వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. మరణానికి కారణాన్ని వివరించే వైద్య రికార్డులను స్కూల్ నిర్వాహకలు అందించలేదని బాలుడి కుటుంబం కియోంఝర్ కలెక్టరేట్ వద్ద మృతదేహంతో నిరసనకు దిగారు.
తన కొడుకు అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్చామని కేఐఎస్ఎస్ యాజమాన్యం ఫోన్ చేసిందని తండ్రి రఘునాథ్ ముండా పోలీసు ఫిర్యాదులో తెలిపారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. హాస్టల్ వాష్రూమ్లో పప్పు పడిన విషయంలో జరిగిన వివాదంలో ముండాపై దాడి చేసి, గొంతు కోసి చంపారని దర్యాప్తు తేలింది. ఈ దాడి వాష్రూమ్లోనే జరిగిందని, బాధితుడిని అతని ముగ్గురు క్లాస్మేట్స్ కొట్టి, ఆపై గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు.
స్కూల్ యాజమాన్యం చెప్పినట్లుగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి, ఖుర్దా జిల్లాలోని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ముగ్గురు విద్యార్థులను కరెక్షనల్ హోమ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Vikarabad district Murder: ప్రేమ పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. కట్నం కోసం కొట్టి చంపిన భర్త
స్కూల్ యాజమాన్యం ఈ విషయాన్ని దాచడానికి సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను దాచడం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, పలువురి అధికారులను సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. బాలుడికి వైద్యం చేసిన ఏడుగురు వైద్యులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.