Crime News: తీవ్ర విషాదం.. కుటుంబ కలహాలు, ఒంటరితనం ఒక నిండు ప్రాణాన్ని, చిగురుటాకులాంటి పసికందు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మనస్పర్థల కారణంగా భర్తకు దూరమై, ఒంటరిగా పోరాడుతున్న ఓ తల్లి.. జీవితంపై విరక్తితో తీసుకున్న కఠిన నిర్ణయం ఇద్దరి జీవితాలను అర్ధాంతరంగా ముగించేసింది.
ప్రేమ వివాహం.. ఆపై పెను భారమైన సంసారం..
వివరాల్లోకి వెళ్తే.. ఇందిరమ్మ కాలనీకి చెందిన బుడగ జంగం గౌరమ్మ (30), తాండూరుకు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రవికాంత్ (6) అనే కుమారుడు ఉన్నాడు. అయితే, కొన్నాళ్లకే దంపతుల మధ్య కలహాలు మొదలవ్వడంతో రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. అప్పటి నుండి గౌరమ్మ తన కుమారుడితో కలిసి పుట్టింటి సమీపంలోని ఒక గదిలో నివసిస్తోంది. రవికాంత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, ఆమె అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
కనిపించని కల్లోలం.. మూగబోయిన గది..
శుక్రవారం సాయంత్రం 5 గంటలైనా గౌరమ్మ గది నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు తుల్జారం అక్కడికి చేరుకున్నాడు. తలుపులు లోపలి నుండి గడియ పెట్టి ఉండటంతో, ఎంత పిలిచినా స్పందన రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన కుటుంబ సభ్యులకు హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఆరేళ్ల రవికాంత్ ఫ్యాన్కు వేలాడుతూ నిర్జీవంగా పడి ఉండగా, పక్కనే గౌరమ్మ కూడా సీలింగ్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన తర్వాత కొడుకు అనాథ కాకూడదన్న ఆవేదనతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: KPHB బస్టాప్లో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు.. సీసీటీవీ ఫుటేజ్
పోలీసుల దర్యాప్తు.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు..
సమాచారం అందుకున్న ఎస్సై విఠల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒంటరి జీవితం భరించలేక, భవిష్యత్తుపై భయంతోనే గౌరమ్మ ఈ నిర్ణయం తీసుకుందని, ఎవరిపై తమకు అనుమానం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్ని చిన్న గొడవలు, వ్యక్తిగత సమస్యలు ప్రాణాలు తీసుకునేంతటివి కావని, ఆపదలో ఉన్నప్పుడు ఆత్మీయుల సాయం కోరాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.