Karnataka News: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు ఆ దంపతులు. ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా భారీ కుదుపు. అనూహ్యంగా భార్య అదృశ్యమైంది. భార్యని హత్య చేశాడంటూ చివరకు జైలు జీవితం అనుభవించాడు ఆమె భర్త. ఆమె జ్జాపకాలు మరిచిపోయి సమయంలో కోరుకున్న ప్రియుడితో దర్శనమిచ్చింది. ఒక్కసారిగా ఆ ప్రాంతవాసులు షాకయ్యారు. ఇందులో తప్పు ఎవరిది? తప్పుడు కేసు పెట్టించిన భార్య బంధువులా? సరిగా విచారణ చేయని పోలీసులా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏం జరిగింది?
సంచలనం రేపిన ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కొడగు జిల్లా కుశాల నగర తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్తో మల్లిగె వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో అంతా బాగానే జరిగింది. ఈ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఏం జరిగింది తెలీదు.. ఒక్కసారిగా మల్లిగె అదృశ్యమైంది.
భార్య వ్యవహారశైలిని గమనించిన సురేశ్, తన భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే వెళ్లిపోయిందని చెప్పేవాడు. భార్య ఎక్కడికి వెళ్లిందో ఆమె భర్త తెలుసు. ఒక రోజు మల్లిగెకి ఫోన్ చేసి తనతో సంసారం చేయకపోయినా పర్వాలేదని, పిల్లలను చూసుకోవాలని సలహా ఇచ్చాడు. వారి కోసమైనా రావాలని ప్రాధేయపడ్డాడు. అయినా సురేశ్ నోటి మాట నీటి మూటలే అయ్యాయి.. ఆమె మనసు కరగలేదు.
సమాజం కూడా సురేశ్ మాటలు నమ్మలేదు. అల్లుడే మా కూతుర్ని హత్య చేశాడంటూ అత్తింటివారు రివర్స్ అయ్యారు. ఆపై పోలీసు కేసు పెట్టారు. చివరకు 2021లో కుశాలనగర పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కేసు నమోదు అయిన కొద్దిరోజులకు అంటే మరుసటి ఏడాది పోలీసుల నుంచి సురేశ్కు ఫోన్ వచ్చింది. మీ భార్య మృతదేహం లభించిందని తెలిపారు.
ALSO READ: ప్రాణం తీసిన ఎర్ర చీర
పిరియా పట్టణ పోలీసులు సురేశ్తోపాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లారు. బెట్టదపురలో ఓ అస్తి పంజరాన్ని చూపించారు. అది మల్లిగె అని గుర్తించడంతో అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు సురేశ్. అక్కడే ఆనవాళ్లు తీసుకుని ల్యాబ్కు పంపారు. అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్ను అరెస్ట్ చేశారు. అంతమ సంస్కారాలు పూర్తి కావడంతో కేసు ముగింపుకు రావడంతో పోలీసులు సురేశ్ను జైలుకి పంపారు.
రెండేళ్లు తర్వాత శవానికి సంబంధించిన డీఎన్ఎ రిపోర్టు వచ్చింది. ఈ శవం ఎవరిదో తెలియకపోవడంతో జైలు నుంచి బయటపడ్డాడు సురేశ్. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో ఏప్రిల్ ఒకటిన మల్లిగె తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఓ హోటల్కు వచ్చింది. అక్కడున్న సురేశ్ ఫ్రెండ్స్ మల్లిగె ఫోటో తీసి సురేశ్కు, పోలీసులకు పంపారు.
ప్రియుడితో సురేష్ భార్య
రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని హోటల్ లో అదుపులోకి తీసుకున్నారు. చివరకు తమదైన శైలిలో విచారణ చేయగా మల్లిగె నిజం చెప్పేసింది. కోరుకున్న ప్రియునితో కలిసి వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చేసింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు.. న్యాయస్థానం తీర్పుతో మైసూరు జైలుకు తరలించారు. చేయని తప్పుకు అన్యాయంగా రెండేళ్లు జైలు జీవితం గడిపాడు సురేశ్.
సురేష్ విషయంలో తప్పు ఎవరిది? మల్లిగె తల్లి గౌరీదా? పోలీసులదా? అన్నదే అసలు పాయింట్. ఇదికాకుండా అప్పట్లో లభించిన శవం ఎవరిది? అన్నది మరో ప్రశ్న. డీఎన్ఎ రిపోర్టు తర్వాత పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబట్టింది న్యాయస్థానం. డిఎన్ఎ రిపోర్టు రాకముందే తుది చార్జిషీట్ దాఖలు చేశారని పోలీసులకు మొట్టికాయలు వేసింది.
హెచ్ఆర్సీకి వెళ్తుందా?
జరుగుతున్న వ్యవహారంపై సురేశ్ తరపు న్యాయవాది మాట్లాడారు. సురేష్కు పరిహారం కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సురేశ్ మనసుకు తగిలిన గాయాన్ని పరిష్కరించడానికి మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ను సంప్రదించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.