Karnataka Crime: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాన్ని విశ్వసించి.. ఓ కూతురు కన్నతల్లినే దారుణంగా హతమార్చింది. అంతటితో ఆగకుండా దీనిని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చకా చకా అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం చేసింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు హత్య వెనకున్న అసలు నిజాలను బయటపెట్టారు.
కర్ణాటకలోని తుమకూరు ప్రాంతానికి చెందిన సుచిత్ర (31).. తన తల్లి పుష్పవతిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. 18 నెలల క్రితం సుచిత్ర తండ్రి అనుమానస్పదంగా మరణించారు. దీంతో సుచిత్ర దిగ్భ్రాంతికి గురైంది. తండ్రి మరణానికి కారణం ఏమై ఉంటుందా? అన్న అనుమానంతోనే రోజులు గుడుపుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ జ్యోతిష్యుడ్ని సుచిత్ర కలిసింది. తన తండ్రి మరణం గురించి ఆయనకు చెప్పింది. దీంతో నీ తండ్రిపై చేతబడి జరిగిందంటూ జ్యోతిష్యుడు సమాధానం ఇచ్చాడు. సొంత భార్యే బ్లాక్ మ్యాజిక్ చేసి హత్య చేయించిందని ఆరోపించారు. ఈ మాటలు నమ్మిన సుచిత్ర.. తల్లి పుష్పవతిపై కోపంతో రగిలిపోయింది. తన తండ్రికి పట్టిన గతినే ఆమెకు పట్టించాలని నిర్ణయించుకుంది.
రాత్రి వేళ తల్లి ఇంటికి వచ్చిన సుచిత్ర.. ఆమె నిద్రిస్తుండటాన్ని గమనించింది. దీంతో బెడ్ వద్దకు వెళ్లి దిండును చేతిలోకి తీసుకుంది. దానిని తల్లి ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసింది. కొద్దిసేపు విలవిలలాడిన పుష్పవతి.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. తల్లి హత్య అనంతరం మరో కుట్రకు కూతురు తెరలేపింది. తల్లిది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
Also Read: Washing Machines Under 15,000: తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మిషన్లు.. ఏమున్నాయ్ భయ్యా.. ఓ లుక్కేయండి!
అయితే సుచిత్ర ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో గ్రామస్థులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మరణం గురించి సుచిత్రను ఆరా తీయగా ఆమె పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా.. తల్లిని తానే చంపినట్లు అంగీకరించింది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అయితే ఈ హత్యలో సుచిత్ర భర్త ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Municipal Elections 2026: తెలంగాణలో జనసేన బోణి.. నేరేడుచర్లలో ఎగిరిన గ్లాసు జెండా