Hyderabad: స్వేచ్ఛ బ్యూరో: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కత్తి తో పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణం ఆదివారం బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
కిషన్ బాగ్ సిటీ గ్రాండ్ సమీపంలో ఉంటున్న నిషాత్ ఫాతిమా (28), సులేమాన్ బిన్ (30)లు దంపతులు. 2016లో వీరికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. సులేమాన్ పాన్ షాప్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా భార్యపై అనుమానంతో సులేమాన్ తరచూ ఫాతిమాతో గొడవ పడుతున్నాడు. ఈ నేపధ్యంలోనే ఇటీవలే సులేమాన్ మరో యువతిని రెండవ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
పుట్టింట్లో ఉంటున్న మొదటి భార్య, ఇద్దరు పిల్లల్ని శనివారం రాత్రి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం ఉదయం వీరి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన సులేమాన్ కత్తితో ఫాతిమా గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను మరో గదిలో పెట్టి ఇంటికి తాళాలు వేసి భర్త పరారయ్యాడు. సాయంత్రం వరకు కూడా ఫాతిమా ఫోన్ స్విచ్ ఆఫ్ గా రావటంతో ఆనుమానించిన ఆమె సోదరి నేరుగా ఇంటికి వచ్చింది.
బయటి నుంచి ఇంటికి తాళాలు వేసి ఉండగా ఇంట్లో నుంచి పిల్లల ఏడవడాన్ని గమనించి తాళాలు పగుల కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫాతిమా రక్తపు మడుగులో మృతి చెంది ఉండడం కనిపించింది. వెంటనే మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బహదూర్ పుర పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బహదూర్ పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తారా? చరిత్ర ఉన్నంత వరకు ఆయనే ఉంటారు.. తలసాని హాట్ కామెంట్స్!