Narsapuram: కేవలం మూడు పదుల వయస్సు ఆ మహిళకు నిండు నూరేళ్లు నిండాయి. ఫ్రెండ్తో వివాహానికి నో చెప్పింది ఆ మహిళ. దీంతో రగిలిపోయిన ఫ్రెండ్ పక్కాగా స్కెచ్ వేసి మహిళను నడిరోడ్డుపై నరికి నరికి చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో వెలుగు చూసింది. అసలేం జరిగింది?
నరసాపురంలో దారుణమైన ఘటన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సఖినేటిపల్లికి చెందిన 31 ఏళ్ల టీనా రోజా ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం సూళ్లూరుపేటలోని నర్సింగ్ కళాశాలలో ట్రైనింగ్ తీసుకుంటోంది. చిన్నప్పుడు టీనా రోజాను ఓ ఉపాధ్యాయురాలు దత్తత తీసుకుంది.
18వ ఏట రోజాను మామిడ కుదురుమండలానికి చెందిన నవీన్కుమార్తో వివాహం జరిగింది. రోజా-నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. హాయిగా సాగుతున్న సంసారంలోకి చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఫలితంగా భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సీన్ కట్ చేస్తే.. అసలు విషయానికి వద్దాం.
పెళ్లికి నో చెప్పిన మహిళను అత్యంత దారుణంగా చంపేశాడు
ఆదివారం ఉదయం ట్రైనింగ్ తర్వాత రోజా నరసాపురం బయలుదేరింది. ఆ మహిళ సమాచారంతో సఖినేటిపల్లికి చెందిన సురేశ్బాబు రైల్వేస్టేషన్కు కారు తీసుకుని వచ్చాడు. వారిద్దరు కారులో సొంత గ్రామానికి బయలుదేరారు. మధ్యలో సఖినేటిపల్లిలంకకు చెందిన పాత ఫ్రెండ్ రమేశ్ వారితో కలిసి బయలుదేరాడు.
తనను పెళ్లి చేసుకోవాలని రోజాను కోరాడు రమేశ్. అందుకు సదరు మహిళ నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్తుండగా జాతీయ రహదారి పక్కన టీ షాపు వద్ద ఆపించాడు. సురేష్ కిందకు దిగగానే రమేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రోజాపై దాడి చేశాడు. రమేశ్ను అడ్డుకునేందుకు డ్రైవర్ సురేశ్బాబు యత్నించాడు. అతడిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
ALSO READ: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!
రక్తపు మడుగులో ఉన్న రోజాను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సురేశ్బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసాపురం డీఎస్పీ తెలిపారు.