Metla Venkata Krishna Sri Sai Suicide: హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో గల కొండాపూర్లోని ‘మై హోమ్ మంగళ’ అపార్ట్మెంట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల యువ వ్యాపారవేత్త మెట్ల వెంకట కృష్ణ శ్రీసాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివాహానికి కేవలం ఐదు రోజుల ముందు ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కృష్ణ శ్రీసాయి మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తన జీవితంపై విరక్తితో ఉన్నట్లు తన సోదరుడు సాయి పవన్ కల్యాణ్కు మెసేజ్ పంపాడు. ఆందోళన చెందిన సోదరుడు వెంటనే మై హోమ్ మంగళలోని ఫ్లాట్ నంబర్ 301కి చేరుకున్నాడు. గది తలుపులు కొట్టినా లోపలి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే కృష్ణ శ్రీసాయి తన గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు.
తీవ్ర రక్తగాయాలతో ఉన్న బాధితుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే కృష్ణ శ్రీసాయి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణ శ్రీసాయి నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరి 22న విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ నెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనులన్నీ చకచకా జరుగుతున్న సమయంలో వరుడు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
అసలు కృష్ణ శ్రీసాయి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివాహ ఏర్పాట్ల విషయంలో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేదా ఇతర ఏదైనా మానసిక ఒత్తిడి ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్లో ఉన్న రూమ్మేట్ విజయ్తో పాటు ఇతరులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. సోదరుడు సాయి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Also: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. ఇంటిపై రాకెట్ అటాక్, ఇద్దరు చిన్నారులు మృతి