Garuda Purana: గరుడపురాణం ప్రకారం తప్పు చేసిన మనిషికి మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..? మరణం సంభవించినప్పుడు జీవుడు పడే బాధలు ఎలా ఉంటాయో తెలుసా..? మరణం తర్వాత కూడా ఎలాంటి బాధలు అనుభవిస్తూ ఆత్మ ప్రయాణం సాగిస్తుందో తెలుసా..? ఇంకా గరుడపురాణం ఏం చెప్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
గరుడ పురాణంలో మనిషి మరణం, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోక విషయాల గురించే కాకుండా ప్రేత కల్పం లాంటి విషయాలు చెప్తుంది. అలాగే ఎవరైనా మరణించినప్పుడు ఇంట్లో గరుడ పురాణం చదివించడానికి కారణం – మరణించిన ఆత్మకు సద్గతులు కలగాలని మరియు జీవించి ఉన్నవారు మృత్యువు పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించడమేనట.
మరణం సంభవించే సమయం (ప్రాణోత్క్రమణం):
మనిషి ప్రాణం పోయే సమయంలో నోటి ద్వారా మాటలు రావట. చూపు మందగిస్తుందట. ఆ సమయంలో యమధర్మరాజు పంపిన ఇద్దరు దూతలు (యమదూతలు) వస్తారట. అయితే పుణ్యం చేసిన వారి దగ్గరకు అయితే దేవదూతలు వస్తారట. వచ్చి దేవ విమానంలో వారిని తీసుకెళ్తారట. వారికి మరణం చాలా ప్రశాంతంగా, నిద్రపోయినట్లుగా ఉంటుందట. ఇక పాపాత్ములకు అయితే యమదూతలు భయంకరమైన రూపాలతో కనిపిస్తారట. ప్రాణం పోయేటప్పుడు తీవ్రమైన వేదన అనుభవిస్తారట.
యమలోక ప్రయాణం (47 రోజుల ప్రయాణం): మరణించిన తర్వాత శరీరాన్ని వదిలిని ఆత్మ ‘అంగుష్ఠ’ (బొటనవేలు) పరిమాణంలో ఉంటుందట. యమదూతలు ఆ ఆత్మను పాశాలతో కట్టి యమలోకానికి తీసుకెళ్తారట. ఈ ప్రయాణం మొత్తం 86 వేల యోజనాలు (పురాణ లెక్కల ప్రకారం ఒక్క యోజనం అంటే 13 కిలోమీటర్లు. 86వేల యోజనాలు అంటే 11 లక్షల 18వేల కిలోమీటర్లు) ఉంటుందట. యమలోకానికి వెళ్తున్న దారిలో ‘వైతరిణి’ అనే భయంకరమైన నది వస్తుందట. ఈ నది సామాన్యులు దాటడం అంత ఈజీ కాదట. బతికి ఉన్నప్పుడు ఎవరైతే గోదానం చేసి ఉంటారో వాళ్లు ఈ నదిని సులభంగా దాటుతారట.
యమధర్మరాజు సభ – చిత్రగుప్తుడి లెక్కలు: అన్ని అడ్డంకులు దాటుకుని 47 రోజులు ప్రయాణం చేసిన ఆత్మ యమలోకం చేరుతుందట. ఆత్మ యమపురికి చేరుకున్నాక, చిత్రగుప్తుడు ఆ మనిషి జీవితకాలంలో చేసిన పాప పుణ్యాల చిట్టాను చదివి వినిపిస్తాడట. అప్పుడు ఆ ఆత్మ చేసిన తప్పులను బట్టి యమధర్మరాజు శిక్షలను ఖరారు చేస్తాడట.
ఆ 13 రోజులు ఆత్మకు ఎంతో ముఖ్యం: మనిషి చనిపోయిన తర్వాత 10 రోజుల పాటు పెట్టే ‘పిండ ప్రదానం’ ఆత్మకు చాలా అవసరట. మొదటి 4 రోజులు పెట్టే పిండం వల్ల ఆత్మకు కొత్త శరీరం (యాతనా శరీరం) ఏర్పడుతుందట. తర్వాతి ఆరు రోజులు ఆ ఆహారం ఆత్మకు ప్రయాణంలో శక్తిని ఇస్తుందట. అందుకే 11, 12, 13వ రోజు కర్మలు అత్యంత ముఖ్యం అంటారు పండితులు.
ఆత్మకు పునర్జన్మ: శిక్షలు అనుభవించిన తర్వాత లేదా పుణ్య ఫలం ముగిసిన తర్వాత, ఆత్మ తన కర్మల ప్రకారం తిరిగి భూమిపై ఏదో ఒక రూపంలో (మనుషులుగా, జంతువులుగా లేదా పక్షులుగా) జన్మిస్తుందట.
గరుడ పురాణం ఇచ్చే ప్రధాన సందేశం: మరణం అనేది ఒక అనివార్యమైన సత్యం. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని, కాబట్టి బతికున్నప్పుడే ధర్మబద్ధంగా, ఇతరులకు మేలు చేస్తూ జీవించాలని ఈ పురాణం మనుషుల్ని హెచ్చరిస్తుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.