
Ayyappa Deeksha : కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ సమయంలోనే లక్షల మంది భక్తులు అయ్యప్పదీక్షను స్వీకరిస్తారు. అయితే.. ఏడాదిలో ఈ నెలలలోనే ఈ దీక్ష స్వీకరించటం వెనక.. అనేక ఆరోగ్య రహస్యాలున్నాయని పెద్దలు చెబుతున్నారు. కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్ష భక్తులకు ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన ప్రయోజనాలను అందిస్తుందని పెద్దలు చెబుతున్నారు.
తలస్నానం: రోజూ ఉదయాన్నే చేసే చన్నీటి తలస్నానం మనసుకు హాయినిస్తుంది. దీనివల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై దైవంపై ఏకాగ్రత పెరుగుతుంది.
మితాహారం: ఈ దీక్షాకాలంలో మితాహారం తీసుకోవటం వల్ల శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీనివల్ల శరీరం తేలికపడటంతో బాటు మనసు తేలికపడి మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
వస్త్రధారణ: అయ్యప్పదీక్షా కాలంలో నల్లని వస్త్రాలు ధరించడం వల్ల వారిపై శని ప్రభావం ఉండదు. అలాగే.. నలుపు రంగు మనోవికారాలను, భౌతిక ఆకర్షణలను దూరం చేసి ఇహపర సుఖాలను త్యజించేలా చేస్తుంది. చలికాలంలో నలుపు దుస్తులను ధరించటం వల్ల అవి ఉష్ణాన్ని గ్రహించి, శరీర ఉష్ణోగ్రతను బేలన్స్గా ఉండేలా చేస్తాయి.
నేల మీద పడుకోవటం: భూమ్మీద పడుకోవటం వల్ల సుఖాలను త్యజించగలిగే శక్తి మనిషికి చేకూరుతుంది. అలాగే శరీరానికి సమతుల్యత చేకూరుతుంది.
పాదరక్షలకు దూరం: దీక్షాకాలంలో పాదరక్షలు వాడరు. దీనివల్ల రాళ్లు, రప్పల శబరికొండ మార్గంలో సులభంగా సాగిపోగలుగుతారు. ఒట్టికాళ్లతో నడవటం వల్ల రక్తప్రసరణలు, హృదయ స్పందనల్లో సమతుల్యత సాధ్యమవుతుంది.
నామం : నుదురు దైవస్థానం. కనుబొమ్మల మధ్యన నుదుటి భాగం యోగ రీత్యా విశిష్ఠమైంది. దీక్ష సమయంలో ఈ భాగంలో ధరించే కుంకుమ, విభూది, గంధం, చందనాల వల్ల నాడీ మండలం చైతన్యంగా మారుతుంది.
సమయపాలన: రోజూ ఖచ్చితమైన సమయానికి లేవటం, నిద్రించటం వల్ల శరీరంలోని జీవక్రియలు క్రమబద్ధంగా మారతాయని, నిద్ర పరమైన సమస్యలూ దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.