Ayyappa Deeksha: అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం కొన్ని రోజులు పాటించే ఆచారం మాత్రమే కాదు.. అది భక్తుడి ఆలోచనల్ని, ప్రవర్తనను, జీవన దృక్పథాన్నే మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ దీక్ష మొదలైన క్షణం నుంచి శబరిమల యాత్ర పూర్తయ్యి, మాల విడిచే వరకూ భక్తులను అందరూ ‘స్వామి’ అని సంబోధించడం మన సంప్రదాయంలో చాలా విశేషమైన అంశం. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్లను స్వామి అని ఎందుకు పిలుస్తారో మనలో చాలామందికి తెలియదు. మరి స్వామి అని పిలవడం వెనకున్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఈ స్వామి అనే పిలుపు సాధారణ పలకరింపుకే పరిమితం కాదు. అది ప్రతి భక్తుడిలో దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తుచేసే ఒక సంకేతం. దీక్షలో ఉన్న సమయంలో అందరూ సమానమే అన్న భావనను, అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవించాలన్న సందేశాన్ని ఇది ఇస్తుంది. కులం, హోదా, ధనిక–పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ఒకే స్థాయిలో చూడాలనే తాత్విక దృష్టి ఇందులో దాగి ఉంది.
దీక్షలో ఉన్న భక్తుడిని ‘స్వామి’ అని పిలవడం ఒక నియమం కాదు.. అది ఆత్మశుద్ధికి, ఆత్మవిశ్వాసానికి, స్వీయ నియంత్రణకు దారి చూపే మార్గం. ఈ సంప్రదాయం ద్వారా భక్తుడు తనలోని దైవత్వాన్ని గుర్తించి, మరింత సాత్వికమైన జీవనానికి అడుగులు వేయడం ఇదే దీక్ష యొక్క అసలైన అర్థం.
Also Read: శబరిమల 18మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత!
హిందూ ధర్మంలో అయ్యప్ప స్వామిని హరిహర సుతుడిగా భావిస్తారు. అంటే శివ-కేశవుల ఏకత్వ రూపమే అయ్యప్ప. ఆయన మాల ధరించిన భక్తులు దీక్ష తీసుకున్న రోజు నుంచి 41 రోజుల పాటు కఠినమైన నియమాలను పాటిస్తూ.. శరీర, మనస్సులను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ దీక్షలో ముఖ్యమైన అంశం బ్రహ్మచర్యం, నియమబద్ధమైన జీవనం, అంతరంగ శుద్ధి.
దేవుడిని బయట వెతకడం కంటే.. భక్తుడు తనలోనే దైవత్వాన్ని మేల్కొల్పుకోవాలనే ఆలోచనతో జీవిస్తాడు. ఉపనిషత్తులలో చెప్పిన ‘తత్త్వమసి’ అనే మహావాక్యం ఇదే విషయాన్ని సూచిస్తుంది. జీవుడు, పరమాత్మ వేరు కాదని. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే, మాల వేసుకున్న ప్రతి భక్తుడిని అయ్యప్ప స్వామి రూపంగానే చూడాలి అనే భావన ఏర్పడింది.
దీక్షలో ఉన్నవారు ఒకరినొకరు స్వామి అని పిలుచుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. అది భక్తుడి మనసులో దాగి ఉన్న అహంకారాన్ని కరిగించే సాధన. ఈ సమయంలో ఎవరు గొప్పవారు, ఎవరు చిన్నవారు అనే భేదాలు ఉండవు. వయస్సు, సంపద, హోదా.. ఇవన్నీ దీక్ష ముందు అర్థం లేని విషయాలే.
మాల వేసుకున్న పేదవాడు కూడా స్వామే. ధనవంతుడూ స్వామే. ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శిస్తూ స్వామి అని పలకరించడం ద్వారా.. భక్తుడు తనలోని ‘నేను’ అనే భావాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇదే అయ్యప్ప దీక్షలోని అసలైన అంతరార్థం.
అయ్యప్ప దీక్ష కులం, మతం, ప్రాంతం అనే గోడలను కూల్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్రలో ఉన్నవారంతా ఒకే నియమాలను పాటిస్తారు. ఒకే మార్గంలో నడుస్తారు. చిన్నవారైనా, పెద్దవారైనా.. దీక్షలో ఉన్నంత వరకు అందరూ సమానులే.
స్వామి.. అనే ఒక్క మాట భక్తుల మధ్య ఐక్యతను పెంచుతుంది. పరస్పర గౌరవం, సోదరభావం, సహనశీలత వంటి విలువలను ఇది సహజంగానే అలవాటు చేస్తుంది. అందుకే.. దీక్ష పూర్తయ్యే వరకు భక్తులు తమను తాము అయ్యప్పగా భావిస్తూ.. ఎదుటివారిలోనూ అదే దైవత్వాన్ని దర్శిస్తూ స్వామి అని సంబోధిస్తారు.
Also Read: అయ్యప్ప దీక్షలో.. నల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా ?