Hanuman: హిందూ పురాణాల ప్రకారం వాల్మీకి మహర్షి రాసిన రామాయణమే ఆదికావ్యంగా మనకు తెలుసు. అయితే.. వాల్మీకి కంటే ముందే భక్త హనుమంతుడు స్వయంగా రామాయణాన్ని రచించాడని ఒక పురాతన గాథ ప్రచారంలో ఉంది. దీనిని ‘హనుమద్ రామాయణం’ అని పిలుస్తారు. రామునిపై తనకున్న అచంచలమైన భక్తితో.. లంకా విజయం తర్వాత హనుమంతుడు హిమాలయాల్లోని శిలలపై ఈ కావ్యాన్ని చెక్కాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రచన వాల్మీకి రామాయణం కంటే ఎంతో అద్భుతంగా.. భావోద్వేగభరితంగా ఉంటుందని ప్రతీతి. ఆ ఆసక్తికరమైన రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాలయాల్లో హనుమద్ రామాయణం:
రావణ సంహారం ముగిసి, శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన తర్వాత.. హనుమంతుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ నివసిస్తున్న సమయంలో.. రాముని పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ, తన గోళ్లతో హిమాలయ శిలలపై రామకథను చెక్కాడు. దీనినే ‘హనుమద్ రామాయణం’ అంటారు. ఇది కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు.. రామునితో కలిసి నడిచిన ఒక భక్తుడి ప్రత్యక్ష అనుభవాల సమాహారం.
వాల్మీకి ఆశ్చర్యం, విచారం:
కొంతకాలం తర్వాత వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని పరమశివునికి అంకితం ఇచ్చేందుకు హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ హనుమంతుడు చెక్కిన రామాయణాన్ని చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడి రచనలో ఉన్న భక్తి భావం, శైలి ,వర్ణనలు చూసి వాల్మీకి అప్రతిభుడయ్యాడు. తాను రాసిన రామాయణం హనుమంతుడి రచన ముందు వెలవెలబోతుందని.. భవిష్యత్తులో ప్రజలు తన రచనను విస్మరిస్తారేమోనని వాల్మీకి మనసులో చిన్న బాధ కలిగింది.
హనుమంతుని గొప్ప మనసు, త్యాగం:
వాల్మీకి ముఖంలో ఉన్న విచారాన్ని గమనించిన హనుమంతుడు కారణం అడిగాడు. వాల్మీకి తన మనసులోని మాటను బయట పెట్టాడు. వెంటనే హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా.. ఒక భుజంపై వాల్మీకిని.. మరో భుజంపై ఆ భారీ శిలలను ఎత్తుకుని సముద్రం దగ్గరకు వెళ్లాడు. రాముని నామస్మరణ చేస్తూ.. ఆ శిలలను సముద్రంలో కలిపేశాడు.
హనుమంతుడు వాల్మీకితో ఇలా అన్నాడు: “వాల్మీకి మహర్షి! నాకు కీర్తి ప్రతిష్టల మీద ఆశ లేదు. రాముడి కథను నేను కేవలం నా తృప్తి కోసం, నా భక్తిని చాటుకోవడానికి రాశాను. మీ రామాయణం లోకానికి మార్గదర్శకంగా నిలవాలి. అదే నాకు సంతోషం.
Also Read: నవరాత్రి పూజల నుంచి నిత్యార్చన వరకు.. ఎరుపు రంగుకు ఎందుకంత ప్రాముఖ్యత
వాల్మీకి ప్రతిజ్ఞ:
హనుమంతుడి నిస్వార్థ భక్తికి, త్యాగానికి చలించిపోయిన వాల్మీకి.. “నేను మరో జన్మ ఎత్తి, హనుమంతుడి గొప్పతనాన్ని చాటిచెప్పేలా రామాయణాన్ని మళ్ళీ రాస్తాను అని మొక్కుకున్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆ వాల్మీకి మహర్షియే కలియుగంలో.. గోస్వామి తులసీదాస్గా జన్మించారని, ఆయన రాసిన ‘రామచరితమానస్’ లో హనుమంతునికి అత్యంత ప్రాధాన్యత లభించిందని భక్తుల నమ్మకం.
నేటికీ ఆ ఆధారాలు ఉన్నాయా ?
సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆ హనుమద్ రామాయణంలోని కొన్ని శ్లోకాలు నేటికీ శాసనాల రూపంలో లభిస్తున్నాయని కొందరు పరిశోధకులు భావిస్తారు. ముఖ్యంగా ‘మహానాటక’ అనే గ్రంథంలో హనుమంతుడు రాసిన కొన్ని భాగాలు ఉన్నాయని చెబుతుంటారు