Mukkoti Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని.. ఈ రోజు చేసే పూజలు కోటి రెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఆచరించాల్సిన ముఖ్యమైన పనులు, నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ద్వారం):
ఈ రోజున అన్ని వైష్ణవాలయాల్లో ‘వైకుంఠ ద్వారం‘ లేదా ‘ఉత్తర ద్వారం‘ ఏర్పాటు చేస్తారు. సూర్యోదయానికి ముందే ఆలయానికి వెళ్లి, ఉత్తర ద్వారం గుండా శ్రీ మహా విష్ణువును దర్శించుకోవడం అత్యంత ముఖ్యం. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి, మరణానంతరం మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
2. కఠిన ఉపవాసం:
ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ప్రధాన విధి.
పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం (నిరాహార వ్రతం) ఉత్తమం.
అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలను (అన్నం) అస్సలు తీసుకోకూడదు.
3. జాగరణ (నిద్రపోకుండా ఉండటం):
ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా భగవంతుని స్మరణలో గడపాలి. దీనిని ‘జాగరణ‘ అంటారు. రాత్రంతా విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, లేదా భగవద్గీత పఠనం చేస్తూ గడపడం వల్ల అనంతమైన పుణ్యం కలుగుతుంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఇది ఒక గొప్ప సాధన.
4. విష్ణు పూజ, పారాయణం:
ఈ రోజున విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం విశేషం.
విష్ణు సహస్రనామ స్తోత్రం, పురుష సూక్తం, నారాయణ కవచం వంటివి పఠించాలి.
శ్రీకృష్ణార్జునుల మధ్య భగవద్గీత ఉపదేశం జరిగింది కూడా ఈ రోజే అని చెబుతారు. అందుకే భగవద్గీత చదవడం చాలా శుభప్రదం.
5. దానధర్మాలు:
ముక్కోటి ఏకాదశి నాడు చేసే దానానికి విశిష్టత ఉంది. శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయడం, వస్త్ర దానం చేయడం లేదా పండ్లు పంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో దుప్పట్లు దానం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
6. ద్వాదశి పారణ:
ఏకాదశి మరుసటి రోజు అంటే ‘ద్వాదశి’ నాడు సూర్యోదయానికి ముందే స్నానాదులు ముగించి, విష్ణువుకు పూజ చేసి, ఆ తర్వాతే భోజనం చేయాలి. దీనినే ‘పారణ‘ అంటారు. ద్వాదశి రోజున ఉసిరి కాయ పచ్చడితో లేదా పొట్లకాయ కూరతో భోజనం చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది.
ముక్కోటి ఏకాదశి కేవలం ఒక పండగ మాత్రమే కాదు.. అది మన మనసును భగవంతుని వైపు మళ్లించే ఒక ఆధ్యాత్మిక సాధన. కోపం, అసూయ వంటి వికారాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా గడపాలి