Raghu Rama Krishnam Raju Vs Siva Rama Raju: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. వైసీపీలో తిరుగుబాటు బావుటా ఎగరవేసి.. అయిదేళ్ల ఆ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ సారి టీడీపీ అభ్యర్ధిగా ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ప్రస్తుతం అక్కడ పోటీ రఘురామరాజు, వైసీపీ అభ్యర్ధి పివీఎల్ నరసింహరాజుల మధ్యే ఉంటుందని భావించినప్పటికీ ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టీడీపీ రెబల్గా బరిలోకి దిగి పార్టీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి అత్యంత బలమైన స్థానంగా ఉన్న అక్కడ శివ ప్రభావం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? ఎవరికి మైనస్ అవుతుంది? అన్న చర్చ మొదలైందిప్పుడు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టిడిపి కంచుకోటల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అక్కడ ఒక్క 2004లో మినహా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్ధులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి గాలిలో సైతం ఉండి ఓటరు టిడిపికి మద్దతుగా నిలిచాడు. ఈ సారి ఉండి నియోజకవర్గం అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటుంది. అక్కడ రాజకీయం రోజు కో మలుపు తిరుగుతూ కాక రేపుతుంది.
ఆఖరి నిమిషంలో ఉండి టీడీపీ టికెట్ దక్కించుకున్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైకిల్ గుర్తు, వైసిపి అభ్యర్థి పీవీఎల్ నరసింహ రాజు ఫ్యాన్ గుర్తుతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రచారం చేసి ఆఖరి నిమిషంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు సింహం గుర్తుతో పోటీకి సిద్దమయ్యారు. అధికార పార్టీ అభ్యర్థి నరసింహ సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గట్టేక్కిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు.
Also Read: స్వామిభక్తిని చాటుకున్నారు..
ఉండిలో టీడీపీ బలం, తనకున్న ఇమేజ్ ప్రభుత్వ వ్యతిరేకతతో తానే గెలుస్తానన్న ధీమాతో రఘురామకృష్ణంరాజు పనిచేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కూడా తనకు మద్దతు ప్రకటించడంతో రఘురామరాజు మెజార్టీ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు ఎవరి ధీమాతో వారు కనిపిస్తుంటే.. చివరి నిముషంలో నామినేషన్ వేసి రెబల్ అవతారమెత్తారు శివరామరాజు.
ఉండి నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు శివరామరాజు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం. టిడిపిలో ఉన్న ముఖ్య నేతలు కార్యకర్తలు తనకు మద్దతు తెలుపుతారన్న నమ్మకంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ బరిలో ఉంటే టీడీపీ ఓటుబ్యాంకుకు చిల్లుపడేఅవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రఘురామకృష్ణంరాజు ఆయన్ని బుజ్జగించడానికి అటు టీడీపీ పెద్దలతో పాటు క్షత్రియ సామాజికవర్గ పెద్దలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంట .
తనకు టికెట్ రాలేదన్న కోపంతో ఉన్న శివ ఎలా అయినా గెలిచి తీరుతానని శపధం చేసి నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు. పదేళ్లపాటు నియోజకవర్గంలో పనిచేసిన అనుభవంతో టిడిపి కార్యకర్తలతో పాటుగా ఇతర పార్టీ కార్యకర్తలను సైతం కలుస్తూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణంరాజు కూటమి ఓట్ బ్యాంక్ చెక్కుచెదరదంటున్నారు టీడీపీ సుదీర్ఘ కాలం నుండి ఉన్న రాజకీయ పార్టీ అని కార్యకర్తల కష్టమనే పునాది మీద టిడిపి నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసని. పార్టీని బట్టే నాయకులకు గుర్తింపు తప్ప వ్యక్తుల ప్రమేయం వారి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే శివ పోటీలో ఉన్న టిడిపి ఓటు బ్యాంకులో ఒక్క ఓటు కూడా బయటకు వెళ్ళదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రఘురామకృష్ణ రాజు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా.. లోలోన మాత్రం ఒకింత గుబులు చెందుతున్నారంట అందుకే శివరామరాజును దారిలోకి తెచ్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంట. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శివ పోటీలో ఉంటే.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న అంశాలపై ఉండి నియోజకవర్గం లో జోరుగా బెట్టింగులు మొదలయ్యాయి.