Balayya: ‘నీ శ్రమ నువ్వు పడు, ఫలితం గురించి ఆలోచించకు.. అనేది నా సిద్ధాంతం. గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు అనలేం కదా! చేయి, కాగితమో, పుస్తకమో ఏదొకటి అడ్డుపెడితే దీపం నిలబడుతుంది. దేనికైనా మన ప్రయత్నం మనం చేయాలి’ అని ప్రముఖ నటుడు మురళీ మోహన్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అలాగే హీరో బాలకృష్ణ గురించి ఓ ఆశ్చర్యకర విషయాన్ని చెప్పారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. జై సింహా సినిమా షూటింగ్ కుంభకోణంలో జరిగింది. అక్కడ చాలా ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి. మేము అందరం ఓ మూడు కాటేజీల్లో బస చేశాము. బాలయ్య కాటేజీ పక్కన నాది, ఎదురుగా బ్రహ్మానందం కాటేజీ ఉంది. వాకింగ్ చేయడం కోసం రోజు పొద్దున్నే నేను 5 గంటలకు లేచేవాడిని. అప్పటికే బాలయ్య వాకింగ్, జిమ్ పూర్తి చేసుకుని నాకు ఎదురు వచ్చేవారు. నేను వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆయన దేవుడి దగ్గర పూజలో ఉండేవారు. ఆయన అన్నీ పక్కా ప్రణాళికగా చేస్తారు.
బాలయ్య ఉదయం 3 లేదా 4 గంటలకు నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చాలా క్రమశిక్షణతో పనులు చేస్తుంటారు. ఆయనకు తిథులు, నక్షత్రాలు, మంచి చెడు.. ఈ విషయాలపై బాగా పట్టుంది. వాటిని ఆచరిస్తారు. బాలకృష్ణ నుంచి నేను కూడా ప్రేరణ పొందాను. పూజ చేయకుండా బయటకు వెళ్లను. ఎంత పని ఉన్నా.. తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. ఏ పని మీద బయటకు వెళ్లినా కూడా పూజ చేయకుండా బయటకు వెళ్లను. అది ఒక నిత్యకృత్యంగా మారింది.
నేను పూజ చేసినప్పుడు మంత్రాలు బయటకు చదువుతాను. దానికి ఒక కారణం ఉంది, నటన ప్రారంభించిన రోజుల్లో నా వాయిస్ కొంచెం పీలగా ఉండేది. అందుకు బిగ్గరగా బయటకు చదవాలని కొందరు సూచించారు. దీనికి నేను పూజను ఎంచుకున్నాను. పూజ చేసినప్పుడు మంత్రాలు గట్టిగా బయటకు చదువుతాను. అలా చేయడం వల్లే నా వాయిస్ సెట్ అయింది.
ఒక రోజు నేను పూజ చేసుకుంటున్నాను. బ్రహ్మానందం వచ్చారు. నా పూజ చాలా సేపు సాగింది. నేను బయటకు వచ్చినప్పుడు ఆయన అడిగారు. మీరు ఎవరికి పూజ చేస్తారని, నేను అందరి దేవుళ్లకు పూజ చేస్తానని చెప్పాను. మీరు ఎవరికి పూజ చేస్తారని బ్రహ్మానందంను అడిగాను. నాకు ఒక్కరే దైవం వేంకటేశ్వర స్వామి అని బ్రహ్మానందం అన్నారు. అలా ఎందుకు అని అడిగాను. దానికి బ్రహ్మానందం ఒక ఉదాహరణ చెప్పారు.
‘మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆమె 10 ఇళ్లలో పనిచేస్తుంది. ఆమెకు ఏదైనా సమస్య వస్తే వాళ్లు చూస్తారు, వీళ్లు చూస్తారని మేము ఎవరు చూడం. అదే మా ఇంట్లో మాత్రమే ఆమె పనిచేస్తే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మేము పట్టించుకుంటాం. అందుకే పూజ కూడా ఒక్కరికే చేస్తాను. ఈ భక్తుడు మనతోనే ఉంటాడని దేవుడు మమల్ని చూస్తాడని బ్రహ్మానందం అన్నారు. ఆయన థియరీలో కూడా ఒక లాజిక్ ఉంది. ఏ దేవాలయానికి వెళ్లినా.. అక్కడి మూల విరాట్ ను వేంకటేశ్వర స్వామిగానే భావిస్తానని బ్రహ్మానందం అన్నారు. కానీ నేను శక్తిని పూజిస్తాను. దానికి రూపం లేదు పేరు లేదని నేను భావిస్తాను అందుకే అందరి దేవుళ్లను పూజిస్తుంటాను’ అని మురళీ మోహన్ అన్నారు.
Also Read: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్
‘ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు.. చికాగోలో బహాయ్ టెంపుల్ కు వెళ్లాం. అక్కడ పెద్ద హాల్ ఉంది. లోపలంతా ఖాళీ.. ఒక చోట ‘సైలెన్స్ ఈజ్ గాడ్’ అని రాసి ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. పక్కవారితో కూడా మాట్లాడకూడదు. చాలా మంది వస్తున్నారు. అలా సైలెంట్ గా కూర్చొంటున్నారు. అంటే వాళ్లు నిశ్శబ్దంలో దైవాన్ని చూస్తున్నారు. ఒకరు నన్ను అడిగారు హిందువులు ఎందుకు అంతమంది దేవుళ్లను పూజిస్తారని, నేను ఒకటే చెప్పాను. మేము ప్రకృతిలోని ప్రతి దాంట్లో దైవాన్ని చూస్తామని చెప్పాను.’ అని మురళీ మోహన్ అన్నారు.