Jyothi Krishna: మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ ను విజవంతంగా నడిపిస్తున్న నిర్మాత ఏఎం రత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఇక రత్నం ఇద్దరు కుమారులు ఇండస్ట్రీలో ఉన్నవారే. పెద్దకొడుకు జ్యోతికృష్ణ. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను రత్నం కృష్ణ అని పిలుస్తారు.
రైటర్ గా ఆయన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. ఆ తరువాత రత్నం కృష్ణ.. నాగార్జునతో కేడి, గోపీచంద్ తో ఆక్సిజన్ సినిమాలు తెరకెక్కించాడు. ఇవి కూడా విజయాన్ని అందుకోలేకపోవడంతో కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి గతేడాది కిరణ్ అబ్బవరం తో కలిసి రూల్స్ రంజన్ సినిమాను తెరక్కించాడు. ఈ సినిమా కూడా జ్యోతికృష్ణకు విజయాన్ని తెచ్చిపెట్టలేదు.
ఇక ఈ ఏడాది అతని అదృష్టం గట్టిగా కలిసివచ్చినట్లు కనిపిస్తుంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు ఇప్పుడు జ్యోతికృష్ణనే అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆయనకు వేరే ప్రాజెక్ట్ ఉండడంతో.. సగం పూర్తి అయిన ఈ సినిమా బాధ్యతలను జ్యోతికృష్ణ అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఇదే కాకుండా తాజాగా జ్యోతికృష్ణ జీవితంలో మరో అదృష్టం వచ్చింది. జ్యోతికృష్ణ భార్య ఐశ్వర్య నేడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక దీంతో రత్నం కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో పవన్ అభిమానులు జ్యోతికృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమాతో ఈ డైరెక్టర్ మొదటి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.