Aarushi Nishank : ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ (Aarushi Nishank) సినిమా ఛాన్స్ ల పేరుతో మోసపోయింది. ముంబైకి చెందిన ఒక చిత్ర దర్శకుడు హిందీ సినిమాలో తనను ప్రధాన నటిగా తీసుకుంటానని చెప్పి, అందుకోసం తన దగ్గర భారీగా డబ్బు తీసుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. తనకు జరిగిన మోసానికి న్యాయం చేయాలని కోరుతూ ఆరుషి నిషాంక్ తన భర్త అభినవ్ పంత్ తో కలిసి స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే ?
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆరుషి నిషాంక్ (Aarushi Nishank) నకిలీ హీరోయిన్ ఆఫర్ తో మోసపోయి, దాదాపు రూ.4 కోట్ల మేర మోసపోయిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… ఆరుషికి నకిలీ సినిమా ఆఫర్ ఇచ్చి కొంతమంది కేటుగాళ్లు మోసం చేసినట్లు సమాచారం. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు రెట్లు ఎక్కువ డబ్బులు హామీ ఇచ్చి, ఒక పాత్ర కోసం ఆమెను రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టమని అడిగారట. ఆ ఆఫర్ కు ఒప్పుకున్న ఆమె దాదాపు రూ.4 కోట్లు చెల్లించింది.
ఆరుషి (Aarushi Nishank) చెప్పిన దాని ప్రకారం, రూ. 5 కోట్లు పెడితే రూ. 15 కోట్ల లాభం వస్తుందని చెప్పడంతో ఆమె ఈ డీల్ కు ఒప్పుకుందట. అంతేకాకుండా స్క్రిప్ట్ ను ఫైనల్ చేయడం, ఆమెకు నచ్చిన పాత్ర ఇస్తామని ఆరుషికి చెప్పారట నిందితులు. ఒకవేళ ఆమె పాత్ర పట్ల సంతోషంగా లేకుంటే, ఇచ్చిన డబ్బును 15% వార్షిక వడ్డీతో తిరిగి ఇస్తామని నమ్మించినట్టు తెలుస్తోంది.
దీంతో ఆమె రూ. 4 కోట్లు పెట్టుబడి పెట్టింది. కానీ ఆరుషికి ఆ పాత్ర రాలేదు, డబ్బు కూడా తిరిగి రాలేదు. చాలా కాలంఎదురు చూసిన తర్వాత, తాను మోసపోయానని గ్రహించిన ఆరుషి డెహ్రాడూన్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లయింట్ మేరకు ముంబై నివాసితులు మానసి వరుణ్, వరుణ్ ప్రమోద్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తనను మోసం చేసిన చిత్ర నిర్మాతలు మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక పేజీలో చిత్ర బృందం నకిలీ ఫోటోలను ప్రసారం చేశారని ఆరుషి ఆరోపించింది. తన డబ్బు తిరిగి అడిగినప్పుడు చంపేస్తామని, తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తామని వారు బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ మోసాలు, డిజిటల్ నేరాలతో ఎంతోమంది సామాన్యులు మోసపోతున్న నేపథ్యంలో, ఒక వీవీఐపీ, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కూడా మోసపోవడం ఖచ్చితంగా ఆందోళనకరమైన విషయమే.
హీరో పేరు వాడుకుని మోసం
ఎఫ్ఐఆర్ ప్రకారం మహారాష్ట్రలోని ముంబైలోని జుహులోని జెబి నగర్లోని ఫెయిరీ ల్యాండ్, రోడ్ 10, కైఫీ అజ్మీ పార్క్ నివాసితులు మాన్సి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా డెహ్రాడూన్లోని ఆరుషి నివాసంలో (Aarushi Nishank)ను సంప్రదించి, తమను తాము మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నారు. నిందితులు తాము షానాయా కపూర్, విక్రాంత్ మాస్సే నటించిన ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకున్నారు .