Jr NTR : టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు సినిమాలే చేస్తామని కుదించుకుపోవటం లేదు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్లో నటించటమే కాదు.. సంపాదించిన డబ్బుని ఇతరత్రా బిజినెస్లలోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే..ఆయన ఫిల్మ్ స్టూడియోలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారని. ముగ్గురు స్నేహితులతో కలిసి శంషాబాద్ దగ్గర భూమిని కోనుగోలు చేసి ఐదు ఫ్లోర్స్తో ఓ స్టూడియోను నిర్మింప చేశారట తారక్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ అక్కడే జరుగుతుందని సమాచారం.
ఇంతకీ ఎన్టీఆర్ చేతులు కలిపిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కాదు.. నిర్మాత వివేక్ కూచిబొట్ల, నిర్మాత అభిషేక్ అగర్వాల్, తాహిర్. ఇందులో నిర్మాతలు ఇద్దరూ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఈ తాహిర్ ఎవరనే సందేహం రాక మానదు. ఇండస్ట్రీలో జరిగే సినిమా షూటింగ్స్కు కావాల్సిన కెమెరాలు, క్రేన్స్ వంటి ఎక్విప్మెంట్స్ను సరఫరా చేసే వాటిలో తాహిర్ టెక్నిక్ సంస్థ ఒకటి. దాని అధినేతే తాహిర్. అయితే ఎన్టీర్ నేరుగా కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన హరికృష్ణతో పెట్టుబడులు పెట్టించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయ్యింది. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో దక్షిణాదిలోకి అడుగు పెడుతోంది. అలాగే సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్గా నటిస్తుండటం విశేషం. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయటానికి నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ను నెక్ట్స్ రేంజ్కి తీసుకెళ్లేలా ఎన్టీఆర్ సినిమాలను ప్లాన్ చేసుకుని లైన్లో పెట్టుకున్నారు.