Pushpa 2 : “పుష్ప 2” సినిమాకు సంబంధించిన మిడ్ నైట్ షోలను రద్దు చేయాలని బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం బెంగుళూరులో కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి షో నిర్వహించడంతో పాటు, టిక్కెట్ల ధరల రేట్లు. ముందుగా తావరేకెరెలోని బాలాజీ, కత్తారిగుప్పెలోని కామాక్య, చంద్రాదయ, రాజాజీనగర్లోని నవరంగ్, మగాడిరోడ్డులోని ప్రసన్న, ఫెలిసిటీ మాల్లోని సినీఫైల్ వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు షో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పైగా బుక్ మై షో లో దీనికి సంబంధించిన బుకింగ్ కూడా మొదలైంది. కానీ ఈ విషయంపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ సినీ నిర్మాతర సంఘం ఏకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.
ఫిల్మ్ ఎగ్జిబిషన్ నిబంధనల ప్రకారం కర్ణాటక థియేటర్లలో ఉదయం 6 గంటలలోపు ఏ థియేటర్లోనూ సినిమాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ రూల్ ను అతిక్రమిస్తే మాత్రం ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు థియేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2) ఎర్లీ మార్నింగ్ షోల విషయంలో కలెక్టర్ స్పందిస్తూ.. కర్ణాటక సినిమా నియంత్రణ చట్టంలోని రూల్ 41 ప్రకారం, డిసెంబర్ 5న నిర్ణయించిన సమయానికంటే ముందుగా సినిమాను ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
దీంతో కర్ణాటకలో అర్ధరాత్రి పడాల్సిన 100కు పైగా షోలు క్యాన్సిల్ కావడం, 6:30 తర్వాత షోలు స్టార్ట్ కావడం వంటివి జరిగింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఇలా జరగడానికి గల కారణం కన్నడ స్టార్ హీరోలు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకూడదు అనే రూల్ కర్ణాటకలో చాలా ఏళ్లుగా ఉంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన చాలా సినిమాలకు ఈ రూల్ ని అస్సలు పాటించలేదు. వాళ్లకైతే ఎలాంటి సమస్య ఉండదు కానీ, ఇప్పుడు ఆకస్మాత్తుగా ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజ్ విషయంలో మాత్రం ఈ రూల్ గుర్తుకు వచ్చింది. కావాలని సినిమాను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ మండిపడుతున్నారు.
దీంతో కొంతమంది రీసెంట్ గా ‘భగీర’ (Bagheera) అనే కన్నడ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకలేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా కన్నడలో అడ్డంకులు క్రియేట్ చేసి ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారు అని అంటున్నారు. మరోవైపు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. సినిమాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి షోలను రద్దు చేశారు. నిజానికి ఇది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల తప్పిదం. ఎందుకంటే ముందుగానే వాళ్ళు ఈ షోలకు అనుమతులు తీసుకొని ఉండొచ్చు. కానీ తీసుకోకుండా వేయడం వల్ల షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఇక కర్ణాటకలో సినిమాకు అడ్డంకులు ఏర్పడడానికి ఇది ఒక కారణమైతే… గతంలో జరిగిన రష్మిక వివాదం మరో కారణం అంటున్నారు. ఒకానొక టైమ్ లో రష్మికను బ్యాన్ చేయాలి అంటూ కన్నడిగులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ‘కాంతారా’ మూవీ రిలీజ్ టైమ్ లో ఆ మూవీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు రష్మిక సమాధానం ఇచ్చింది. కానీ తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరును ప్రస్తావించడానికి రష్మిక ఇష్టపడకపోవడంతో ఈ గొడవ జరిగింది.