El Niño Effect: సాధారణంగా జూలై నెల వచ్చిందంటే చాలు.. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు జలపాతాల వైపు పరుగులు తీస్తారు. జోరు వానల మధ్య కొండకోనల నుంచి ఎగసిపడే జలధారలను చూసి మురిసిపోతుంటారు. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల రుతుపవనాలు మొరాయించడంతో వానలు లేక తెలంగాణలోని ప్రముఖ జలపాతాలన్నీ వెలవెలబోతున్నాయి.
బోసిపోయిన ఆదిలాబాద్ అడవులు
పర్యాటకానికి పెట్టింది పేరైన ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి జూలై నెలలో కూడా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి పాలధారల్లా జాలువారాల్సిన జలపాతాలన్నీ నీటి ప్రవాహం లేక రాతి బండల్లా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన కుంటాల, పోచ్చర జలపాతాలు ఇప్పుడు కళతప్పాయి. ఎప్పుడూ పర్యాటకుల కేరింతలతో, సందడితో కిటకిటలాడే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం ఆవరించింది. ముఖ్యంగా కుంటాల జలపాతం ఏ క్షణాన చూసినా ఎడారిని తలపిస్తోంది.
పర్యాటకుల్లో తీవ్ర నిరాశ
వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఎంతో ఆశతో, దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇక్కడి పరిస్థితి చూసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ‘గతంలో ఈ టైంలో ఎంత అద్భుతంగా ఉండేదో.. ఇప్పుడేమో కనీసం చుక్క నీరు కూడా లేదు’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు. వానలు ఎప్పుడు పడతాయో, మళ్లీ జలపాతాల్లో ఎప్పుడు జోష్ వస్తుందోనని స్థానిక వ్యాపారులు, పర్యాటకులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.
Also Read: మంచు కరిగినా తగ్గని క్రేజ్.. ఒక్కరోజే 24 వేల మంది! అమర్నాథ్లో ఏం జరుగుతోంది?