బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆగిపోవడం లేదు. వారం క్రితం జరిగిన ఒక హిందూ యువకుడి హత్య ఘటన మరువకముందే.. తాజాగా మరో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజ్బరి జిల్లాలో అమృత్ అనే హిందూ యువకుడిని అల్లరి మూకలు అతి కిరాతకంగా హత్య చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. అక్కడి మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను మరింత పెంచింది.
వివరాల ప్రకారం.. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అమృత్పై దాడి చేసి ప్రాణాలు తీశారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యక్తులపై దాడులు పెరగడం గమనార్హం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు హిందూ యువకులు బలవ్వడం అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది.
రాజ్బరి జిల్లాలో జరిగిన ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నిందితులు ఎవరు? ఈ దాడి వెనుక ఉన్న కారణాలేంటి? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వరుస హత్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు స్పందించాలని, బంగ్లాదేశ్లోని మైనారిటీలకు రక్షణ కల్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరంతరాయంగా జరుగుతున్న ఈ దాడులు మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.