చైనాలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ రక్షణ మంత్రులు వీ ఫెంగ్హే.. లీ షాంగ్ఫులకు చైనా కోర్టు మరణశిక్ష విధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అయితే ఈ శిక్షను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గత కొంతకాలంగా సైన్యంలో.. రాజకీయ వ్యవస్థలో చేపట్టిన అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తా సంస్థ పేర్కొంది.
మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్ఫు 2024లో దర్యాప్తును ఎదుర్కొన్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. భారీ ఎత్తున నగదు.. విలువైన వస్తువులను లంచంగా తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. తనతో పాటు ఇతరుల పదోన్నతుల కోసం అనుచిత ప్రయోజనాలను ఆశించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. చైనా అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) సభ్యుడిగా ఉన్న లీ.. 2023లో అకస్మాత్తుగా ప్రజల కంటికి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఆయనను రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించారు.
లీ షాంగ్ఫు కంటే ముందు రక్షణ మంత్రిగా పనిచేసిన వీ ఫెంగ్హే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయనపై కూడా ఇవే తరహా అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి బహిష్కరించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) లో జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగానే ఈ ఇద్దరు అగ్రనేతలపై వేటు పడింది. గతేడాది షీ జిన్పింగ్ సైన్యంలోని తొమ్మిది మంది అగ్రశ్రేణి జనరల్లను.. సెంట్రల్ మిలిటరీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ హే వీడాంగ్ను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనల పేరుతో తొలగించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలపై పీఎల్ఏ డైలీ (PLA Daily) స్పందిస్తూ.. అధికారుల ప్రవర్తన వల్ల సైన్యంలో విశ్వాసం దెబ్బతిన్నదని.. కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని ఇది సవాలు చేసే విధంగా ఉందని పేర్కొంది. కేవలం అవినీతిని అంతం చేయడమే కాకుండా.. సైన్యంపై తన పట్టును మరింత బిగించడానికి జిన్పింగ్ ఈ చర్యలు చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ వంటి ప్రముఖులు కూడా అకస్మాత్తుగా మాయమవ్వడం.. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవడం చైనాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
Read Also: అవినీతి చేసి ఉంటే చెప్పుతో కొట్టండి… సవాల్ విసిరిన పోసాని!