Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పరిచయం అవసరం లేని పేరు. రచయితగా నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజకీయాలలోకి కూడా వచ్చారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్న పోసాని కృష్ణమురళి(Posani krishna Murali) ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలలో ఉన్నటువంటి ఈయనపై పలు విమర్శలు రావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్న పోసాని తాజాగా ఆపరేషన్ అరుణా రెడ్డి(Operation Arunaa Reddy) అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పోసాని కృష్ణమురళి గతంలో తన గురించి వచ్చిన అవినీతి ఆరోపణల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాను తన సినిమాలను తాను చేసుకొనివ్వండి. ఎవరు రోడ్డు పైకి లాగే ప్రయత్నం చేయొద్దు అంటూ ఈయన తెలిపారు.అదేవిధంగా తన గురించి గతంలో ఎంతోమంది అవినీతి ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే చెప్పుతో కొట్టండి అంటూ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. తాను గతంలో ఒక రూపాయి అవినీతికి పాల్పడిన, ఒక బ్రోకర్ పని చేసిన నన్ను చెప్పుతో కొట్టొచ్చు. ఇలా నిజానిజాలు తెలియకుండా అనవసరంగా నన్ను తిడితే మాత్రం తాను గట్టిగానే రెస్పాండ్ అవుతానని పోసాని తెలిపారు. తాను జగన్ కు మాత్రమే కాకుండా గతంలో చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్, చిరంజీవి పార్టీలకు కూడా మద్దతు తెలిపానని తెలియజేశారు. నిజంగానే తాను అవినీతిపరుడు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి తనకు మూడు పదవులను ఆఫర్ చేశారు కానీ తాను ఏవి తీసుకోలేదని ఈ సందర్భంగా పోసాని బయటపెట్టారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు స్వయంగా నన్ను పిలిచి మంత్రి పదవి తీసుకోమన్నారు, అలాగే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి తీసుకోమని చెప్పినప్పటికీ నేను ఏది తీసుకోలేదు. ఒకవేళ నేను నిజంగానే అవినీతిపరుడు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయామంలో ఒక 5 ఎకరాల పొలం తీసుకొని స్టూడియో కట్టుకునే వాడిని కాని తాను అలా చేయలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను ఒక అవినీతి చేసినా, ఒక బ్రోకర్ పని చేసినా నన్ను చెప్పుతో కొట్టొచ్చు: నటుడు పోసాని
అనవసరంగా నన్ను తిడితే నేను పెద్దగా రెస్పాండ్ అవుతా: పోసాని కృష్ణమురళి
జగన్ పదవి గానీ, ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ తీసుకోమన్నారు:పోసాని
నేనే అవినీతిపరుడిని అయితే జగన్తో ఐదు ఎకరాల… pic.twitter.com/CG3Ri6Ob7B
— BIG TV Breaking News (@bigtvtelugu) May 7, 2026
ఇక పోసాని కృష్ణమురళి ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన అనంతరం 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఈయన ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఇక ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈయనపై కేసులో నమోదు అయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పోసాని ఇప్పుడు ఆపరేషన్ అరుణా రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: సినిమాల షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అదే కారణమా?