Hantavirus Cruise Ship Outbreak: ప్రపంచం కోవిడ్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. మరో కొత్త వైరస్ వార్త టెన్షన్ పెడుతోంది. ‘ఎంవీ హోండియస్’ (MV Hondius) అనే క్రూయిజ్ షిప్లో హంటావైరస్ వ్యాప్తి చెందడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అలర్ట్ ప్రకటించారు. ఈ షిప్ ఎట్టకేలకు స్పెయిన్లోని టెనెరిఫ్ తీరానికి చేరుకుంటోంది. పరిస్థితి తీవ్రతను బట్టి సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్వయంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అసలేం జరిగింది?
డచ్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ హోండియస్ షిప్లో గత కొన్ని రోజులుగా అంతుచిక్కని అనారోగ్యంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో షిప్లో ఉన్న సుమారు 140 మంది ప్రయాణికులు , సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
రంగంలోకి WHO చీఫ్ టెడ్రోస్ :
ఈ ఆపరేషన్ ఎంత కీలకం అంటే.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ శనివారం స్పెయిన్ చేరుకున్నారు. స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మోనికా గార్సియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి తరలింపు ప్రక్రియను సమన్వయం చేస్తున్నారు. “ప్రస్తుతానికి షిప్లో ఉన్న ఎవరికీ లక్షణాలు లేనప్పటికీ.. అత్యంత జాగ్రత్తగా ఐసోలేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాం” అని టెడ్రోస్ ప్రకటించారు.
ఐసోలేషన్, క్వారంటైన్ రూల్స్:
షిప్ తీరానికి చేరుకోగానే, ప్రయాణికులను సాధారణ ప్రజల్లోకి అనుమతించరు. టెనెరిఫ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ జోన్కు వారిని తరలిస్తారు.
లక్షణాలు లేని వారు: ఆరు వారాల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి.
అనారోగ్యంతో ఉన్న వారు: వీరి కోసం ప్రత్యేక మెడికల్ విమానాలను స్పెయిన్ సిద్ధం చేసింది. మెయిన్ ల్యాండ్ ఐరోపాకు తరలించి వీరికి చికిత్స అందిస్తారు.
అంతర్జాతీయ సహకారం: అమెరికా, బ్రిటన్ తమ పౌరులను తీసుకువెళ్లడానికి ప్రత్యేక విమానాలను పంపిస్తున్నాయి.
Also Read: కొబ్బరి బొండాం నుంచి నేరుగా నీళ్లు తాగుతున్నారా? నిపుణుల సీరియస్ వార్నింగ్!
హంటావైరస్ అంటే ఏంటి? ఇది ప్రమాదకరమా?
సాధారణంగా ఎలుకల మలమూత్రాల ద్వారా ఈ హంటావైరస్ వ్యాపిస్తుంది. గాలి ద్వారా లేదా కలుషితమైన ఆహారం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. అయితే..ఈ షిప్లో బయటపడిన ‘ఆండీస్ వైరస్ రకం మనుషుల నుంచి మనుషులకు కూడా అరుదైన సందర్భాల్లో వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఇంత టెన్షన్. దీని లక్షణాలు బయటపడటానికి 1 నుంచి 8 వారాల సమయం పడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కాంటాక్ట్ ట్రేసింగ్:
ఈ వైరస్ బయటపడకముందే ఏప్రిల్ 24న షిప్ నుంచి కొంతమంది ప్రయాణికులు వేర్వేరు దేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు 4 ఖండాల్లోని 12 దేశాల అధికారులు ఆ ప్రయాణికుల కోసం వెతుకుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఒక ప్రయాణికురాలు మరణించడంతో ఆమెతో ప్రయాణించిన విమాన సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రిస్క్ తక్కువగానే ఉందని WHO చెబుతున్నప్పటికీ.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.