Iran Attack Oil Tanker Oman Coast: పశ్చిమ ఆసియాలో ఇరాన్.. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు ఇప్పుడు సముద్ర వాణిజ్య మార్గాలను అతలాకుతలం చేస్తోంది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్పై ఇరాన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడి సమయంలో ట్యాంకర్లో మొత్తం 15 మంది భారతీయులు విధులు నిర్వహిస్తుండగా.. వారిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
దాడికి గురైన ట్యాంకర్లో ఉన్న సిబ్బంది అంతా ప్రాణభయంతో వణికిపోయారు. గాయపడిన నలుగురు భారతీయులకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 11 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒమన్ సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనతో అంతర్జాతీయ చమురు రవాణా సంస్థలు తమ నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ నావికుల భద్రత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.