హోలీ నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే కీలక ఏర్పాట్లు చేస్తోంది. రంగుల పండుగ సందర్భంగా ప్రయాణాలు సజావుగా కొనసాగేలా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1200 పైగా హోలీ స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే హోలీ సందర్భంగా 132 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతటా ECoR పరిధి గుండా వెళతాయి. రద్దీ సమయంలో ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూస్తాయి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి 2026 చివరి వరకు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఇవి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాలను కవర్ చేస్తాయి. ప్రారంభంలో భువనేశ్వర్–యశ్వంత్ పూర్, భువనేశ్వర్–ధన్ బాద్, సంబల్పూర్–ఈరోడ్, పూరి–పాట్నా మార్గాల్లో నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి, షాలిమార్, చర్లపల్లి, SMVT బెంగళూరుకు పలు రైళ్లు వెళ్తాయి. ప్రారంభ రైళ్లతో పాటు, ఢిల్లీ, పాట్నా, ఎర్నాకులం, చెన్నై, కోల్కతా, బెంగళూరు, తిరువనంతపురం లాంటి నగరాల నుంచి 150 అదనపు హోలీ ప్రత్యేక రైళ్లు ECoR స్టేషన్ల గుండా వెళతాయి. కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయి.
అటు రద్దీని నియంత్రించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, పూరి, సంబల్పూర్, బ్రహ్మపూర్, విశాఖపట్నంలలో హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసింది. నియంత్రిత ప్రవేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే ఏర్పాట్లు చేసింది. క్యూయింగ్ ఏర్పాట్లు, బారికేడింగ్ తో ఇబ్బందులు లేని బోర్డింగ్ ను అందిస్తుంది. అదనపు రైల్వే రక్షణ దళ సిబ్బంది, ప్రత్యేక సిబ్బంది ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేస్తారు.
అటు హోలీ రద్దీ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో మెరుగైన పారిశుధ్య చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లతో పాటు ఆన్ బోర్డ్ రైళ్లలో ఇంటెన్సివ్ క్లీనింగ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాట్ ఫారమ్ లు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తారని తెలిపారు. ఇందుకోసం అదనపు హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. తాగునీరు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, అందుబాటులోకి 1,244 స్పెషల్ రైళ్లు!
రైళ్లు సమయ పాలన పాటించేలా సీనియర్ రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి, వేగంగా స్పందించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ప్రయాణీకులు ప్రయాణాలను ప్లాన్ చేసే ముందు అధికారిక రైల్వే విచారణ వ్యవస్థలు, IRCTC ద్వారా షెడ్యూల్, సమయాలు, సీట్ల లభ్యతను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.
Read Also: రైల్ వన్ యాప్లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? వావ్, ఇంత సులభమా!