Strait of Hormuz Closed: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు పెను సంక్షోభానికి దారితీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆ దేశం రగిలిపోతోంది. తన అగ్రనేతను కోల్పోయిన ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేలా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని నిన్న రాత్రి నుండి మూసివేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉండే ఈ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి.. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత ప్రధానమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం చమురులో ఐదో వంతు (20 శాతం) వాటా కేవలం ఈ ఒక్క మార్గం ద్వారానే సాగుతుంది.
హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారతదేశంపై అత్యంత తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుండి భారత్కు వచ్చే క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు తప్పనిసరిగా హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. ఇప్పుడు ఈ మార్గం మూతపడటంతో చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో సామాన్యులపై పెను భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఇప్పుడు సముద్ర మార్గం కూడా మూతపడటం భారత్కు పెను సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు నిల్వలను సమకూర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనకపోతే ఈ ప్రభావం ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ తన పంతాన్ని వీడి జలసంధిని ఎప్పుడు తెరుస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. అప్పటివరకు గల్ఫ్ దేశాల నుండి చమురు ఎగుమతులు స్తంభించిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. భారత విదేశాంగ శాఖ కూడా తన దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Iran Supreme Mojtaba: ఇరాన్ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు మొజ్తబా? రేసులో ముగ్గురు వ్యక్తులు