Iran Blocks Pakistan Vessel: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ ఈ జలసంధిపై తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఇరాన్ తన ప్రాదేశిక జలాల్లో నిబంధనలను కఠినతరం చేస్తూ, పాకిస్థాన్కు వెళ్తున్న ఒక కంటైనర్ నౌకను అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా నుంచి పాకిస్థాన్లోని కరాచీ వైపు ప్రయాణిస్తున్న సెలీన్ అనే కంటైనర్ నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు అడ్డుకున్నాయి. ఈ నౌక జలసంధిలోకి ప్రవేశించకుండా వెనక్కి మళ్లాలని ఇరాన్ ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం రవాణా అనుమతి లేకపోవడమేనని ఇరాన్ స్పష్టం చేసింది.
IRGC నేవీ కమాండర్ అలీరెజా తంగ్సిరి ఈ ఘటనపై స్పందిస్తూ.. “చట్టపరమైన ప్రోటోకాల్స్ను పాటించడంలో విఫలమవ్వడం, అనుమతి లేకపోవడం వల్లే సెలీన్ నౌకను వెనక్కి పంపాము” అని వెల్లడించారు. ఈ జలమార్గం గుండా వెళ్లే ఏ నౌక అయినా ఇరాన్ మారిటైమ్ అథారిటీతో పూర్తి సమన్వయం కలిగి ఉండాలని ఆయన హెచ్చరించారు.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు (1/5th) ఈ హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్లతో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా మూసివేసినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు అనుబంధంగా ఉన్న నౌకలను తాము అనుమతించబోమని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ‘శత్రు దేశాలకు’ చెందిన నౌకలపై దాడులు జరుగుతుండటంతో, అంతర్జాతీయ ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.
నౌకాయానం కోసం ఈ మార్గాన్ని తెరిచే ఉంచుతామని చెబుతున్న ఇరాన్ కొన్ని షరతులను విధిస్తోంది. శత్రువులతో సంబంధం లేని నౌకలు ముందుగానే ఇరాన్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. శత్రు దేశాలకు చెందిన లేదా వారితో సంబంధం ఉన్న నౌకలకు ఈ మార్గం పూర్తిగా మూసివేయబడుతుంది.
మరోవైపు, పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ ఒక మధ్యవర్తిగా వ్యవహరించాలని భావిస్తోంది. పొరుగు దేశమైన ఇరాన్తో ఉన్న సుదీర్ఘ సంబంధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని, శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది. అయితే, తన దేశానికి వస్తున్న నౌకను ఇరాన్ అడ్డుకోవడం పాకిస్థాన్కు దౌత్యపరమైన సవాలుగా మారింది.