Iran Attack On Oman: పశ్చిమాసియా ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది. తాజాగా ఒమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. వీరు చికిత్స పొందుతున్నారని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పేర్కొంది. ఒమెన్ లోని సంబంధిత కంపెనీతో పాటు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నామని తెలిపింది.
ఈ డ్రోన్ దాడి ఘటన మస్కట్ సమీపంలోని సోహార్ నగరంలో జరిగిందని అధికారులు ధ్రువీకరించారు. దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 11 మందిలో 10 మంది భారతీయులే ఉన్నారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతుండడంతో… 1.50 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి అసీం మహాజన్ తెలిపారు. ఒమెన్ లో డ్రోన్ దాడి ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలను తెలియలేదన్నారు. సోహార్లో రెండు డ్రోన్ దాడులు జరిగగా… ఇందులో ఒకటి అల్ అవీ ఇండస్ట్రియల్ జోన్ ను ఢీకొట్టింది. ఇక్కడ పనిచేస్తున్న భారతీయుల్లో ఇద్దరు మృతిచెందినట్లు పేర్కొంది.
దీంతో పశ్చిమాసియా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య ఐదుకి చేరింది. అయితే, ఒమన్లో మాత్రం ఇదే మొదటిసారి. అంతకుముందు మర్చంట్ నౌకల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఇరాన్ యుద్ధం ప్రభావం.. వాటర్ బాటిళ్లకు సెగ, ఎండాకాలంతో ధరలు పెరిగే ఛాన్స్
దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గురువారం ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతతో పాటు ఇంధన రవాణా మార్గాల భద్రత గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా తన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాబోయే రోజుల్లో వాణిజ్య విమానాల ద్వారా భారతీయులను తరలించే అవకాశం ఉందని సమాచారం. హర్మూజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తలతో గల్ఫ్లోని భారతీయ నౌకల్లోని వారితో ప్రభుత్వం టచ్ ఉందని అధికారులు చెబుతున్నారు.