Iran-Israel War Report: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం.. నేటితో 8వ రోజుకు చేరుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడితో మెుదలైన ఈ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మధ్యప్రాచ్యంలోని దాదాపు ప్రతీ దేశం.. క్షిపణిదాడులు, డ్రోన్ దాడులతో నష్టపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ – అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ప్రధానంగా జరుగుతున్న ఈ యుద్ధంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తున్నట్లు పేర్కొంటున్నారు. శుక్రవారం వరకూ జరిగిన యుద్ధంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, ప్రాణ నష్టం, ప్రపంచ దేశాలపై ప్రభావం ఈ కథనంలో పరిశీలిద్దాం.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి కీలక నగరాలపై భారీగా వైమానిక దాడులు చేశాయి. యుద్ధం మెుదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా.. ఇరాన్ తన డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్తో పాటు ఖతార్, బహ్రెయిన్, కువైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులు జరిపింది. అమెరికా మిలటరీ బేస్ లను ధ్వంసం చేసి.. ట్రంప్ నకు భారీ నష్టాన్ని కలిగించింది. మరోవైపు ఇరాన్ కు మద్దతుగా ఉన్న లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్.. ఇజ్రాయెల్ పై దాడులు చేయడం మెుదలుపెట్టింది. దీంతో ఈ యుద్ధం పక్క దేశానికి కూడా వ్యాపించింది.
యుద్ధం కారణంగా లెబనాన్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి సుమారు 2,30,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ గగనతలాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం యుద్ధ మేఘాల మధ్య చిక్కుకొని ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిముఖ్యమైన చమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (Strait of Hormuz) ను ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు యుద్ధ భయంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా విమానయాన రంగానికి ఇంధన ఖర్చులు పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి.
Also Read: Iran Airport Blast: ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ విమానాశ్రయంలో భారీ పేలుళ్లు.. వీడియోలు వైరల్
ఇరాన్ కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిర్స్ అండ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,230 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఇరాన్ లోని ఆస్పత్రులు, ఫార్మసీలు, పాఠశాలలు, పోలీసు స్టేషన్లు, జిమ్ లు, క్షిపణి లాంచర్లు, టెహ్రాన్ లోని ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయని ఇరాన్ మీడియా పేర్కొంది. దేశంలోని 174 నగరాలను ఈ దాడులు తాకాయని స్పష్టం చేసింది. మరోవైపు లెబనాన్ లో 217 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ లోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
Also Read: OnePlus Discount: 12GB ర్యామ్, 6000mAh బ్యాటరీగల వన్ప్లస్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎక్కడంటే