War Insurance Rules: అమెరికా – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. సౌదీ, ఖతార్, కువైట్, యూఏఈ, ఇరాక్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విచక్షణా రహితంగా దాడులు చేస్తోంది. అయితే ఈ యుద్ధంలో సైనిక స్థావరాలు, మిలటరీ బేస్ లు మాత్రమే కాకుండా ప్రైవేటు ప్రొపర్టీలైన భవనాలు సైతం క్షిపణి దాడులకు గురై ధ్వంసమవుతున్నాయి. దీంతో యుద్ధంలో భవనాలు లేదా ఆస్తులు దెబ్బతింటే బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయా? లేదా? అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది. ఇంతకీ బీమా నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
సాధారణంగా బీమా పాలసీలో ‘యుద్ద మినహాయింపు నిబంధన’ (War Exclusion Clause) అనే ముఖ్యమైన పాయింట్ తప్పనిసరిగా ఉంటుంది. దీని ప్రకారం యుద్ధం లేదా యుద్దాన్ని తలపించే ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగే నష్టాలకు బీమా వర్తించదు. ఆ నష్టాలకు బీమా కంపెనీలు ఎలాంటి బాధ్యతను వహించవు.
బీమా కంపెనీలు జారీ చేసే స్టాండర్డ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు సైతం చాలా వరకూ క్షిపణి దాడులు లేదా విదేశీ శత్రువుల వల్ల కలిగే నష్టాలను కవర్ చేయవు. దీనికి కారణం ఏంటంటే.. యుద్ధం వల్ల కలిగే నష్టం చాలా భారీగా ఉంటుంది. అంచనా వేయలేనంత నష్టాన్ని యుద్ధం కలిగిస్తుంది. ఒకవేళ బీమా వాటిని కవర్ చేయాల్సి వస్తే.. ఏకకాలంలో వందలాది భవనాలు లేదా ఇళ్లకు లెక్కలేనంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే బీమా కంపెనీలు వీటిని అసాధారణ విపత్తులుగా పరిగణించి సాధారణ ప్రీమియంలలో వీటికి రక్షణ కల్పించవు.
కొన్ని బీమా కంపెనీలు టెర్రరిజాన్ని కవర్ చేసే ఆప్షన్స్ కూడా ఇస్తుంటాయి. ఒకవేళ సాధారణ బీమా పాలసీతో పాటు టెర్రరిజం కవర్ ఆప్షన్ ను తీసుకున్నట్లయితే ఉగ్రవాద దాడుల వల్ల కలిగే నష్టాన్ని బీమా కంపెనీలే భరిస్తాయి. అయితే దీనిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. టెర్రరిజం దాడిగా ప్రభుత్వం దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు దేశాల మధ్య అధికారికంగా యుద్ధం ప్రకటించబడితే అప్పుడు టెర్రరిజం కవర్ కాదు. కేవలం ఉగ్రవాద చర్యలకు మాత్రమే ఈ పాలసీ పరిమితం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
విమానాశ్రయాలు, ఓడరేవులు, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల వంటి వాటికి వార్ రిస్క్ ఇన్సూరెన్స్ (War Risk Insurance) అనే పాలసీనీ బీమా కంపెనీలు జారీ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఏదైనా క్షిపణి దాడి జరిగి.. అవి దెబ్బతింటే బీమా కంపెనీలు నష్టపరిహారాన్ని చెలిస్తాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య ఉద్రిక్తలు భారీగా పెరిగిపోవడంతో.. మెజారిటీ బీమా కంపెనీలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే ఓడలకు వార్ రిస్క్ పాలసీలు చేయడం లేదు. ఒకవేళ ఇచ్చినా సాధారణ రోజులతో పోలిస్తే 50-100 శాతం అధికంగా పాలసీ రేటును పెంచేసి కవరేజీ ఇస్తున్నట్లు సమాచారం.
భవనాలు, ఆస్తుల రక్షణకు సంబంధించిన బీమా పాలసీతో పోలిస్తే.. ప్రాణాలకు సంబంధించిన బీమా రూల్స్ కాస్త భిన్నంగా ఉంటాయి. ఒక వ్యక్తి క్షిపణి దాడిలో మరణిస్తే.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అతడికి క్లెయిమ్ చెల్లిస్తాయి. ఒకవేళ స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనడం లేదా దేశ సైన్యం తరపున శత్రువులపై పోరాడటం వంటివి చేస్తే ఈ బీమా వర్తించదు.