EPFO Interest Rate: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథావిధిగా ఉంచింది. వడ్డీ రేటును 8.25 శాతంగానే కొనసాగించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సోమవారం తెలిపింది. వరుసగా రెండో సంవత్సరం కూడా వడ్డీ రేటును 8.25 శాతంగా ఉంచింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును, 2023-24లో స్వల్పంగా 8.25 శాతానికి పెంచారు.
2020-21లో అత్యధికంగా 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును.. మార్చి 2022లో ఈపీఎఫ్ఓ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.10 శాతానికి తగ్గించింది. ఆ తర్వాత క్రమంగా పెంచింది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. 1977-78 లో వడ్డీ రేటు కనిష్టంగా 8 శాతం ఉంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత, 2025-26కు సంబంధించిన వడ్డీని ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ చందాదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మార్చి 2020లో ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.
Also Rate: ఈపీఎఫ్ఓ UPI విత్ డ్రా పై బిగ్ అప్డేట్.. ఏప్రిల్ నాటికి కొత్త యాప్.. 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్
ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం 7 కోట్ల మందికి పైగా చందాదారులున్నారు. 2023-24లో 8.25 శాతానికి పెంచారు. అప్పటి నుంచి అదే వడ్డీ రేటును సంస్థ కొనసాగిస్తుంది. అన్క్లెయిమ్డ్ పీఎఫ్ డిపాజిట్లకు సంబంధించి సీబీటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో రూ.1000 కంటే తక్కువ మొత్తాలు ఉన్న 1.33 లక్షల ఖాతాలను గుర్తించారు. ఈ మొత్తం రూ.5.68 కోట్లను త్వరలో చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.