Iran Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్లకు సంబంధించిన వివాదం.. ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా వ్యూహాత్మక పాయింట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఖమేనీ తెలిపారు.
ప్రపంచ దేశాలపై ఒత్తిడిని పెంచే విధంగా హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని మొజ్తాబా ఖమేనీ తెలిపారు. ఇరుకైన ఈ జలమార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. ఇలాంటి సమయంలో హర్మూజ్ మూసివేతను కొనసాగించడం.. తమ లక్ష్యాలను చేరుకునే మార్గంగా ఇరాన్ నాయకుడు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి సందేశంలో ఇరాన్ అమరవీరుల ఆత్మ శాంతించేలా ప్రతీకారం తీర్చుకుంటామని, జలసంధిని మూసివేస్తామని అన్నారు.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని లేదంటే వాటిపై నిరంతరం దాడి చేస్తామని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా దళాలకు స్థావరాలు కల్పించిన గల్ఫ్ అరబ్ దేశాలు వెంటనే ఆ స్థావరాలను మూసివేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా వాగ్దానం చేసిన రక్షణ అబద్ధం తప్ప మరేం కాదని అన్నారు. రుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది.
ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నాయకుడు ఖమేనీ హెచ్చరించారు. శత్రువుల ఆస్తులను భారీ స్థాయిలో నాశనం చేస్తామని అన్నారు. యుద్ధంలో నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. వైద్య చికిత్స ఉచితంగా అందిస్తామన్నారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత సుప్రీం నాయకుడిగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీ తొలిసారి బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఆయన కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో తాము చేసిన దాడిలో అతను గాయపడి ఉండవచ్చని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. మినాబ్ పాఠశాలపై దాడిలో మరణించిన పిల్లలతో సహా యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్క ప్రాణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు.
Also Read: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్ సిగ్నల్, ఇండియా షిప్లకు అనుమతి
గల్ఫ్లోని ఇంధన మార్గాలను మూసివేయడంతో.. అమెరికాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా హర్మూజ్ జలసంధి, బాస్రా నౌకాశ్రయంలోని నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు బ్యారెల్కు 100 డాలర్ల కంటే ఎక్కువగా పెరడంతో.. గల్ఫ్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.