Iran Vs America: అమెరికాతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. జరుగుతున్న యుద్ధంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం చాన్నాళ్లు సాగవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అమెరికాతో ఇక చర్చల్లేవ్-ఇరాన్
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఇప్పటికప్పుడు అంచనా వేస్తోంది ఇరాన్ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోలామ్హోస్సేన్ మొహ్సేని-ఎజీ, మతాధికారి అలిరేజా అరాఫీ భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
తాత్కాలిక నాయకత్వ మండలి రెండో సమావేశాన్ని సోమవారం లేకుంటే మంగళవారం నిర్వహించనుంది. వీరి భేటీ తర్వాత ఇరాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అమెరికాలో ఇక చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది ఇరాన్. ఇజ్రాయెల్ -అమెరికా దాడుల నుంచి ఇరాన్ తనను తాను రక్షించుకుంటుందని తెలిపింది.
కీలక నేతల భేటీ తర్వాత ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వెల్లడి
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణమని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహూ అధికార దాహానికి ట్రంప్ సహకరిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ సాయుధ దళాలు దురాక్రమణను ప్రారంభించలేదన్నారు.
ఇజ్రాయెల్ అధికార దాహానికి అమెరికన్ సైనికులను బలి ఇచ్చారని ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు. ట్రంప్ తన ఊహలతో ఈ ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికన్ దళాలకు ప్రాణనష్టం సంభవిస్తుందని భయపడుతున్నారని రాసుకొచ్చారు.
ALSO READ: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. 165కు చేరిన విద్యార్థినుల మృతుల సంఖ్య
దౌత్య చర్చలపై వస్తున్న నివేదికలను ఆయన తోసిపుచ్చారు. వాషింగ్టన్తో చర్చలకు ఇరాన్ తలుపులు మూసేసిందన్నారు. ఇరాన్ స్థాపనలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ప్రభావవంతమైన వ్యక్తులలో అలీ లారిజానీ ఒకరు. అంతేకాదు దివంగత ఖమేనీకి దీర్ఘకాల సలహాదారుడిగా పని చేశారు కూడా.