Israel Occupy Gaza | గాజా (Gaza)లోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ను దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించారు. మరింత మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. గాజా పట్టీలోని అదనపు ప్రదేశాలను ఆక్రమించాలని ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పాలస్తీనా పౌరులు ఉన్న ప్రదేశాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
‘‘ఐడీఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించేందుకు గాజాలో సెక్యూరిటీ జోన్లను విస్తరించండి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ జాప్యం చేసేకొద్దీ, మరింత భూమిని కోల్పోతుంది. దానిని ఇజ్రాయెల్లో విలీనం చేసుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి జరుగుతుతన్న ఇజ్రాయెల్ దాడుల్లో 85 మంది గాజా వాసులు మృతి చెందారు. 133 మందికి గాయాలయ్యాయి.
గాజాలో సైనిక చర్య కొనసాగించేందుకు ఆయన గురువారం ఆమోదముద్ర వేశారు. బందీలు విడుదలయ్యే వరకూ గాజాపై సైన్యం ఒత్తిడి పెంచాలన్నారు. ఇక అక్కడి ప్రధాన ప్రదేశాల్లో నాలుగు దళాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఐడీఎఫ్ శుక్రవారం ప్రకటించింది. కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా బుధవారం ట్యాంకులు, పదాతి దళాలు ఆక్రమణకు దిగాయి. నెట్జారిమ్ కారిడార్లో ఈ సైనిక చర్య జరిగింది. ఉత్తర, దక్షిణ గాజాలను వేరు చేసేలా రెండు వైపుల నుంచి ఈ ఆపరేషన్ జరిగింది.
గాజాలోని తుర్కిష్ ఆసుపత్రిని ఐడీఎఫ్ దళాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. గతంలో ఐడీఎఫ్ గాజాలో ప్రవేశించినప్పుడు తుర్కిష్-పాలస్తీనియన్ వైద్యశాలనే తమ ఆపరేషనల్ బేస్గా మార్చుకున్నాయి. దీని కింద హమాస్ సొరంగాల నెట్వర్క్ ఉన్నట్లు గత ఏడాది ఐడీఎఫ్ ప్రకటించింది.
గాజాలో తీవ్ర ఇంధన కొరత
గాజాలో తీవ్ర స్థాయిలో ఇంధన కొరత నెలకొంది. ఫలితంగా రెడ్ క్రిసెంట్ ఎమర్జెన్సీ వాహనాల్లో సగానికి పైగా నిరుపయోగంగా మారాయి. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ అంతర్గత నిఘా చీఫ్ సస్పెండ్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ఆ దేశ అంతర్గత నిఘా విభాగం షిన్బెట్ అధిపతి రొనెన్ బార్ని సస్పెండ్ చేశారు. ఆయనపై తమకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. బార్ స్థానంలో కొత్త చీఫ్ నియమించబడిన తర్వాత లేదా ఏప్రిల్ 10న ఆయన పదవీ విరమణ చేస్తారని ప్రకటించారు. బార్ పదవీకాలం ఈ సంవత్సరం ముగియనుంది. ఇద్దరి మధ్య సంబంధాలు ముందే దెబ్బతిన్నాయి. హమాస్ దాడికి షిన్బెట్ వైఫల్యం కారణమని మార్చి 4న విడుదలైన నివేదికలో పేర్కొన్నారు.
బార్ పదవీ విరమణపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. నెతన్యాహు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని ఆరోపించాయి. జెరూసలెంలో ప్రధాని నివాసం, పార్లమెంట్ వద్ద భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాయి. బార్ స్పందిస్తూ, నెతన్యాహు తనపై చర్యల వెనక ఉద్దేశాలను దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 7 హమాస్ దాడికి షిన్బెట్ వైఫల్యం కారణమని 2023లోనే అంగీకరించారు. హమాస్ చేసిన దాడుల్లో దాదాపు 1,300 మంది ఇజ్రాయెల్ వాసులు, విదేశీయులు చనిపోయారు. ఈ ఘటన తర్వాతే గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది.