NYC Mayor Election-2025: ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే.. ఏ ప్రభుత్వానికైనా కష్టాలు తప్పవు. ట్రంప్ సర్కార్కు అదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికలు అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ సిటీ మేయర్ పీఠం డెమోక్రటిక్ పార్టీ వశమైంది. జొహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ సిటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయన భారత్ మూలాలు కలిగిన వ్యక్తి.
న్యూయార్క్ మేయర్ పీఠంపై భారతీయ సంతతి వ్యక్తి
అమెరికాలో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. ట్రంప్ హెచ్చరికలను సైతం న్యూయార్క్ సిటీవాసులు లెక్క చేయలేదు. అతడికే ప్రజలు పట్టం కట్టారు. న్యూయార్క్ సిటీ మేయర్గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి. అంతేకాదు తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి. భారతీయ సంతతి వ్యక్తి కూడా.
న్యూయార్క్ మేయర్ పీఠంపై 34 ఏళ్ల జొహ్రాన్ మమ్దానీ కూర్చోనున్నారు. అత్యంత పిన్న వయసు మేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతీయ-ఉగాండా మూలాలున్న కలిగిన వ్యక్తి జొహ్రాన్ మమ్దానీ. ఎన్నికల్లో జోహ్రాన్ ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నికను ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
ట్రంప్ షాకిచ్చిన ఫలితాలు, ఉత్సాహంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు
న్యూయార్క్ మేయర్గా గెలిచిన మమ్దానీ, భారతీయ సినీ డైరెక్టర్ మీరానాయర్ కొడుకు. ఉంగాండా జాతీయుడు మహమూద్ మమ్దానీ-మీరానాయర్కు జన్మించిన సంతానం. ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించాడు. బాల్యంలో న్యూయార్క్ వెళ్లి క్వీన్స్ ప్రాంతంలో పెరిగాడు. సోషలిస్ట్ భావజాలం కలిగిన జోహ్రాన్.. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూపై సంచలన విజయం సాధించారు.
మమ్దానీ విజయం వెనుక కీలకమైన హామీ ఉచిత సిటీ బస్సు ప్రయాణం. ఇదేగాకుండా సిటీలో అద్దెలను స్థిరీకరిస్తానని ప్రచారం చేశారు. యూనివర్శల్ ఛైల్డ్ స్కీమ్ అమలు చేయడంతోపాటు 2030 నాటికి కనీస వేతనాల పెంపు,సంపన్నులపై పన్ను పెంచి చిరు జీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానన్నది ప్రధాన హామీ. ఆయన వరాల జల్లు సిటీవాసులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ASLO READ: పర్మినెంట్ గా అమెరికాలో.. ఈ-వీసాపై ఇండియన్స్ కన్నేశారా?
మమ్దానీ గెలుపు డెమొక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో ఆ పార్టీకి దూరమైన ఉదారవాద బావజాలం వ్యక్తులు, ఇప్పుడు మద్దతుగా నిలిచారు. ఇరు పార్టీలు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1969 తర్వాత మేయర్ ఎన్నికకు అత్యధిక స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు అక్కడి ఎన్నికల బోర్డు తెలిపింది.
గెలుపు తర్వాత న్యూయార్క్ సిటీకి కాబోయే మేయర్ జొహ్రాన్ మమ్దానీ ప్రసంగించారు. ట్రంప్ పాలనను ఆయన ఎండగట్టారు. ఈ సందర్భంగా నెహ్రూ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. చరిత్రలో ఒక్క క్షణం చాలా అరుదుగా వస్తుందన్నారు. పాత నుంచి కొత్తగా మారినప్పుడు.. ఒక యుగం ముగిసినప్పుడు, ఒక దేశం యొక్క ఆత్మ చాలా కాలం అణిచివేతకు గురై, తిరిగి లేచినప్పుడు అంటూ ప్రస్తావించారు. ఇవాళ మన న్యూయార్క్ కూడా పాత నుంచి కొత్త యుగంలోకి మారిందన్నారు.
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025