చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిప్ మేకింగ్ లో వరల్డ్ టాప్ కంపెనీ అయిన ఎన్విడియాని డైలమాలో పడేసింది. విదేశీ ఏఐ చిప్ల వినియోగంపై చైనా నిషేధం విధించడంతో ఎన్విడియా సంస్థ భారీ మార్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. 2022 నాటికి చైనా ఏఐ చిప్ తయారీ పరిశ్రమలో ఎన్విడియా సంస్థకు 95 శాతం వాటా ఉంది, ఇప్పుడది పూర్తిగా జీరో కాబోతోంది. దీంతో ముందుగానే ఎన్విడియా మేల్కొంది. భారత్ వైపు చూస్తోంది. ‘ఇండియా డీప్ టెక్ అలయన్స్’లో చేరేందుకు సిద్ధమై 850 మిలియన్ డాలర్ల పెట్టుబడికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇండియా డీప్ టెక్ అలయన్స్ అంటే?
ఇది కేవలం ఇండియాకు చెందినది మాత్రమే కాదు. దక్షిణాసియా దేశాల్లోని డీప్ టెక్ అంకుర సంస్థలకు నిధులు అందించడమే లక్ష్యంగా ఈ అలయెన్స్ ని ఏర్పాటు చేశారు. దీంట్లో భారత్, అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు ఉన్నారు. క్వాల్కామ్ వెంచర్స్, యాక్టివేట్ ఏఐ, ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్, కలారి క్యాపిటల్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉంటూ.. ఇప్పటి వరకు 1 బిలియన్ డాలర్ల(రూ.8800 కోట్ల) పెట్టుబడిని అందించాయి. ఈ నిధులతో డీప్ టెక్ విభాగంలో అంకుర సంస్థలు పరిశోధనలపై దృష్టి పెట్టాయి.
ఎన్విడియా చేరిక..
అమెరికాకు చెందిన ఎన్విడియాను ఇబ్బంది పెట్టేలా ఇటీవల చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్విడియా బిజినెస్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఆ నష్టాన్ని పూడ్చుకోడానికి ఎన్విడియా తెలివిగా అడుగులు వేస్తోంది. ఇండియా డీప్ టెక్ అలయన్స్ లో చేరడానికి సిద్ధమైంది. ఎన్విడియా చిప్ లను చైనా నిషేధించినా.. అంకుర సంస్థల ఉత్పత్తులకు మాత్రం డిమాండ్ ఉంటుంది. అంటే అందులో పార్టనర్ గా ఉన్న ఎన్విడియా కూడా లాభ పడుతుందనమాట.
భారత్ కి వరం..
ఆధునిక యుగంలో ఏఐ చిప్ లు లేకుండా ఏ పని జరిగేలా లేదు. ఆ రంగంలో అభివృద్ధి సాధిస్తున్న కంపెనీలే ఇప్పుడు అత్యథిక లాభాలు మూటగట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో అంకుర సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల భారత ప్రభుత్వం పరిశోధన-ఆధారిత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏకంగా 12 బిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కూడా భారత అంకుర సంస్థలకు భారీగా మేలు చేకూర్చబోతోంది. అటు ఎన్విడియా వంటి సంస్థల సహకారం ఇండియా డీప్ టెక్ అలయన్స్ కి టర్నింగ్ పాయింట్ మారబోతోందని అంటున్నారు టెక్ నిపుణులు.
ఎన్విడియా ఏం చేస్తుంది?
ఎన్విడియా సంస్థ పెట్టుబడులు పెట్టడమే కాదు, పలు స్టార్టప్ కంపెనీలకు సాంకేతిక మార్గదర్శనం చేస్తుంది. ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంది. భారత సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా కట్టడి చేయడంతో ఎన్విడియా భారత్ వైపు దృష్టిసారించింది. అమెరికా కంపెనీల విషయంలో చైనా మరింత కఠినంగా వ్యవహరిస్తే, అది భారత్ కు మరింతగా ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అమెరికా.. చైనా సహా ఇతర దేశాల కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు చైనా మొదలు పెట్టింది.
Also Read: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..