వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బదిలీ చేస్తానన్న వ్యాఖ్యలు ఇఫ్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే.. ఈ ప్రతిపాదనను నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పష్టంగా తోసిపుచ్చింది. దీంతో ట్రంప్ కు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
మచాడో చేసిన ప్రకటనపై స్పందించిన నోబెల్ కమిటీ.. అవార్డుల బదిలీకి సంబంధించిన నిబంధనల గురించి క్లియర్ కట్ గా వివరించింది. నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం, ఇంకొకరితో పంచుకోవడం లేదా రద్దు చేయడం వంటివి అసాధ్యమని కమిటీ స్పష్టం చేసింది. ఒకసారి కమిటీ నిర్ణయం వెలువడిన తర్వాత అదే ఫైనల్ నిర్ణయం అని.. గ్రహీతలు తమ గౌరవాన్ని లేదా అవార్డును ఇతరులకు అధికారికంగా అప్పగించే అవకాశం లేదని తేల్చి చెప్పింది.
మచాడో తన అవార్డును తనకు ఇవ్వాలనుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. అమెరికా పట్ల.. అలాగే తన పట్ల ఉన్న గౌరవంతోనే ఆమె ఈ ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం మచాడో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ అంశంపై నేరుగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వెనిజులాలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించి విచారణ నిమిత్తం వాషింగ్టన్కు తరలించిన తర్వాత అక్కడ అధికార మార్పిడి జరిగింది. మచాడో అగ్రపీఠాన్ని అధిష్టించకుండా, మదురో వారసురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో మచాడో అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే ట్రంప్కు దగ్గరవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని అని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. తాను రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేవలం ఎనిమిది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలను ముగించానని.. ఇది శాంతి దిశగా చేసిన అద్భుత ప్రయోగమని ఆయన వాదించారు. ఇదే క్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో అవార్డు ఇవ్వడాన్ని విమర్శించారు. ఏమీ చేయకముందే ఒబామాకు అవార్డు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం మచాడో ప్రకటన, నోబెల్ కమిటీ నిరాకరణతో ఈ అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ALSO READ: హల్దీయాలో ఇండియన్ నేవీ కొత్త బేస్.. చైనా, బంగ్లాదేశ్లకు భారత్ గట్టి కౌంటర్!