మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. దేశ రాజధాని మెక్సికో సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఓ సమావేశంలో ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రోటోకాల్ ప్రకారం భద్రతా సిబ్బంది ఆమెను అక్కడున్న జర్నలిస్టులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో ప్రెస్మీట్ మధ్యలోనే నిలిచిపోయింది.
ఈ భూకంప కేంద్రం దక్షిణ రాష్ట్రమైన గెరెరోలోని సాన్ మార్కోస్ పట్టణానికి సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆకపుల్కోకు సమీపంలో జరిగింది. పసిఫిక్ తీర ప్రాంతంలో భూమి లోపల సంభవించిన కదలికల వల్ల ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని తెలిపారు. అయినప్పటికీ.. సహాయక బృందాలు, స్థానిక అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రధాన నగరాల్లోని భవనాల పటిష్టతను అధికారులు తనిఖీ చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ALSO READ: Jagtial Crime: రూ. 12 వేల కోసం దారుణ హత్య.. తండ్రీకొడుకుల అరెస్ట్