కేవలం 12 వేల రూపాయల చిట్టి డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జగిత్యాల పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్య, అదే ప్రాంతానికి చెందిన బాసోజి శ్రీనివాస్ వద్ద చిట్టి వేశాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ అంజయ్యకు రూ. 12,000 బాకీ పడ్డాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అంజయ్య గత కొంతకాలంగా శ్రీనివాస్ను కోరుతున్నాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాస్, అంజయ్యను వదిలించుకోవాలని పథకం వేశాడు.
హత్య ఎలా చేశారంటే..?
డిసెంబర్ 31న రాత్రి సమయంలో శ్రీనివాస్, అతని కుమారుడు వేణు చారీ కలిసి అంజయ్యను నమ్మబలికి పిలిపించుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి అంజయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
నిందితుల అరెస్ట్
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో భాగంగా నిందితులు శ్రీనివాస్, వేణు చారీలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. స్వల్ప నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం పట్ల పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALSO READ: Hyderabad: భారీ పొగమంచు.. శంషాబాద్ ఎయిర్పోర్టులో 10 విమాన సర్వీసులు రద్దు