Fire Accident: నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఒక నిరుపేద కుటుంబం నిలువనీడ కోల్పోయింది. మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు సంపల్లీ ప్రాంతానికి చెందిన కథల మొగులయ్య అనే వ్యక్తి నివాసంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. కేవలం ఒక చిన్న దీపం ఆ కుటుంబం తలదాచుకునే నీడను బూడిద చేయడం స్థానికంగా అందరినీ కలచివేసింది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని కథల మొగులయ్య నిత్యం లాగే ఉదయం నిద్రలేచి తన దైనందిన కార్యక్రమాలను ముగించుకున్నాడు. ప్రతిరోజూ పూజ చేసే అలవాటు ఉన్న మొగులయ్య, శుక్రవారం కావడంతో ఇంట్లోని దేవుడి ఫొటోల ముందు భక్తితో దీపం వెలిగించాడు. అనంతరం జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లిన సమయంలో, గాలికి లేదా మరేదైనా కారణంతో దీపం నుంచి మంటలు పక్కనే ఉన్న వస్తువులకు అంటుకున్నాయి.
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో క్షణాల్లో ఇల్లు మొత్తం వ్యాపించాయి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, బట్టలు, ధాన్యంతో పాటు ముఖ్యమైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కష్టపడి కూడబెట్టుకున్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు కళ్లముందే బూడిదవ్వడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మొగులయ్య కుటుంబం ఈ ప్రమాదంతో రోడ్డున పడింది. చేతిలో చిల్లిగవ్వ లేక, తలదాచుకోవడానికి నీడ లేక ఆ కుటుంబం విలవిల్లాడుతోంది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి నివాసం ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దేవుడి గదిలో దీపం.. ఇల్లు దగ్ధం
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ పరిధిలో అగ్నిప్రమాదం
ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ఇల్లు
దీపం పెట్టి కూలీ పనులకు వెళ్లిన ఇంటి యజమాని
దేవుడి గదిలో నుంచి వ్యాపించిన మంటలు
ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం pic.twitter.com/UK6mJR2DtG
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026