Hormuz Strait Oil Tankers: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకి కీలకమైన హోర్మోజ్ జల సంధిని మూసివేసింది. ఈ మార్గంలో వచ్చే ఆయిల్ ట్యాంకర్లను పేల్చి వేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే పలు ట్యాంకర్లపై దాడులు చేసింది. దీంతో హోర్మోజ్ వద్ద సుమారు 700లకు పైగా ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు.
మార్చి 1న 2.8 మిలియన్ బారెల్స్ తో మూడు ఆయిల్ ట్యాంకర్లు మాత్రమే హోర్ముజ్ను జల సంధిని దాటాయి. సాధారణ రోజుల్లో.. రోజువారీ సగటు రవాణా 19.8 మిలియన్ బ్యారెళ్లు కాగా..ఇందులో 86% తగ్గి కేవలం 2.8 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే రవాణా అయ్యాయి. మార్చి 2న ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ముందుకు కదిలాయి. హోర్మోజ్ జలసంధికి ఇరువైపులా దాదాపు 706 ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయాయి. ఇందులో 334 ముడి సరకు రవాణా ట్యాంకర్లు కాగా, 109 ఆయిల్ రవాణా ట్యాంకర్లు, 263 శుద్ధి చేసిన ఆయిల్ రవా చేస్తున్న నౌకలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. మరో 26 ట్యాంకర్లపై స్పష్టం రాలేదు. ఒమన్ గల్ఫ్లో రవాణాకు సిద్ధమవుతున్న వందలాది ట్యాంకర్లు నిలిచిపోయి ఉన్నాయి.
హోర్మోజ్ జల సంధి వద్ద ఉద్రిక్తతలతో… అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు దాదాపు 10% పెరిగి బ్యారెల్కు 80 డాలర్లకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా శుద్ధి కర్మాగారం, ఖతారీ ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడులతో చమురు శుద్ధి కర్మాగారాలను మూసివేస్తున్నారు. యుద్ధం మరో 15 రోజులు సాగితే ట్యాంకర్ల క్యూలు మరింత పెరిగే అవకాశం ఉంది. హార్మోజ్ను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న ఓడలకు సరుకు రవాణా ధరలు, ప్రీమియంలు పెరగనున్నాయి. ఈ ఖర్చులు భారం నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ పై పడతాయి.
Also Read: బాంబుల సెగకు తోడైన భూకంపం.. ఇరాన్లో ప్రకృతి ప్రకోపం.. వణుకుతున్న గెరాష్!
ఆసియా, యూరప్లోని రిఫైనరీలు.. యూఎస్ గల్ఫ్, వెస్ట్ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నాయి. అయితే భారత్, చైనా.. హోర్మోజ్ మార్గంలోని గల్ఫ్ చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. దేశంలో ధరలను నియంత్రించేందుకు భారత్.. పెట్రోల్, డీజిల్ ఎగుమతులను నియంత్రించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచవచ్చని తెలుస్తోంది.